Chinas EV market: దారుణంగా పడిపోయిన ఈవీ కంపెనీల షేర్లు.. ధరల తగ్గింపులే కారణమా?
China’s EV market Struggles as BYD Shares Fall: ప్రపంచంలోనే అతి పెద్ద ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపనీ చైనాకు చెందిన బీవైడీ అకస్మాత్తుగా ధరలను 35 శాతం వరకు తగ్గించింది. కంపెనీ ఈ ప్రకటన చేసిన వెంటనే స్టాక్ మార్కెట్లో బీవైడీ షేర్లు ఒక్క రోజే ఏకంగా 17 శాతం క్షీణించాయి. దీంతో పాటు ఇతర ఈవీ కంపెనీల షేర్లు దారుణంగా పడిపోయాయి. మరి కంపెనీ ధరలు తగ్గించడానికి గల కారణాలేంటో ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో ఎలాన్ మస్క్కు చెందిన టెస్లా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. చైనా మార్కెట్లో దాదాపు ఏకచత్రాధిపత్యం కొనసాగించింది టెస్లా.. మార్కెట్లో పోటీ లేనప్పుడు మస్క్కు చెందిన టెస్లా రారాజు అయ్యింది. తర్వాత క్రమంగా చైనా మార్కెట్లో బీవైడీ.. అంటే బిల్డ్ యువర్ డ్రీమ్ కార్లు రావడం మొదలుపెట్టడంతో టెస్లా హవా కాస్తా క్రమంగా తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం బీవైడీ కార్లు గ్లోబల్ మార్కెట్లను శాసించే స్థాయికి ఎదిగింది. చైనాతో పాటు యూరోప్లో టెస్లాకు గట్టి పోటీ ఇచ్చింది బీవైడీ. ప్రస్తుతం బీవైడీ కూడా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయినట్లు తెలుస్తోంది. దీని అమ్మకాలు క్రమంగా తగ్గిపోవడంతో దాని ప్రభావం లాభాలపై కనిపించింది. దీంతో ఒక్క రోజే దీని షేర్లు 17 శాతం క్షీణించి ఇన్వెస్టర్ల భారీ నష్టాలకు గురి చేసింది. ఇక అసలు విషయానికి వస్తే చైనా మార్కెట్లో ఒక వైపు డిమాండ్ తగ్గిపోవడంతో కంపెనీలు పోటీ పడి ధరలు తగ్గించాల్సి వస్తోంది. దాని ప్రభావం బీవైడీ షేర్ల పై పడింది. ఇక చైనాలో ఎలక్ర్టిక్ కార్ల మార్కెట్లు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోవడంతో ధరలు తగ్గించాల్సి వచ్చింది.
చైనా మార్కెట్లో ప్రైజ్ వార్ మొదలు కావడంతో బీవైడీ కూడా ఎలక్ట్రిక్ కార్ల ధరలను దాదాపు 35 శాతం తగ్గించుకోవాల్సి వచ్చింది. కంపెనీ ధరలు తగ్గిస్గున్నట్లు ప్రకటించగానే స్టాక్ మార్కెట్లు దీని షేరు క్రమంగా క్షీణించడం మొదలైంది. ఇక అసలు విషయానికి వస్తే ఎలక్ట్రికల్ వెహికిల్స్ అంటే ఈవీ కార్ల అమ్మకాలు ప్రపంచంలోని అతి పెద్ద మార్కెట్లలో క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో కంపెనీలు ధరలు తగ్గించి అమ్మకాలు పెంచుకోవాలనుకుంటున్నాయి. ఇక బీవైడీ సేల్స్ విషయానికి వస్తే నెల ప్రతిపాదికన చూస్తే ఏప్రిల్తో పోల్చుకుంటే మే నెలలో కేవలం 0.6 శాతం అమ్మకాలు పెరిగాయి. అయితే మెయిన్ల్యాండ్ చైనాలో మాత్రం 2.5 శాతం తగ్గాయి. అమ్మకాలు మందగించడంతో చైనాలో ఈవీ కార్ల ధరలను కంపెనీలు పోటీ పడి తగ్గించుకుంటూ పోయాయి.
చైనాలో అమ్మకాలు తగ్గుముఖం పట్టడంతో దాని ప్రభావం స్టాక్ మార్కెట్లో కంపెనీ షేర్ల కనిపించింది. హాంకాంగ్లో లిస్ట్ అయ్యే బీవైడీ షేర్లు ఈ నెల 2వ తేదీన ఏకంగా 17 శాతం క్షీణించాయి. దీంతో దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు 15.6 బిలియన్ డాలర్లు తుడిచిపెట్టుకుపోయింది. ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే సుమారు 1 లక్ష35వేల కోట్ల రూపాయిలుగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత రోజు అంటే ఈ నెల 3వ తేదీన నాలుగు శాతం కోలుకుని ఇన్వెస్టర్లకు కాస్తా ఉపశమనం కలిగించింది. ఇక మార్కెట్లో పోటీని తట్టుకునేందుకు బీవైడీ 22 మోడల్స్కార్ల ధరలను తగ్గించింది. దాని ప్రభావంతో కంపెనీ ఫలితాలు అంచనా కంటే కూడా బాగా తగ్గాయి. ఇక బీవైడీ మేనెలలో 3 లక్షల82వేల476 కార్లను విక్రయిస్తే.. ఏప్రిల్తో పోల్చుకుంటే కేవలం 0.6 శాతం వృద్ది మాత్రమే కనిపించింది. అయితే ఏడాది ప్రాతిపదికన చూస్తే స్వల్పంగా పెరిగినా.. నెలవారి ప్రాతిపదికన చూస్తే ఏప్రిల్తో పోల్చుకుంటే మే నెలలో చైనాలో అమ్మకాలు 2.5 శాతం తగ్గడం బీవైడీని బాగా దెబ్బతీసింది.
ఇక చైనా ఎలక్ట్రిక్ కార్ల విషయానికి వస్తే దశాబ్దకాలంగా ప్రభుత్వం ఈవీ ఇండస్ర్టీని ప్రోత్సహించింది. 2000 సంవత్సరం నుంచి చైనా వ్యూహాత్మకంగా ఎలక్ట్రిక్ కార్ల ఇండస్ర్టీని ప్రోత్సహిస్తూ వచ్చింది. ఈవీ రంగంలో బిలియన్ల కొద్ది పెట్టుడులను ఆకర్షించింది. చైనా ప్రభుత్వమై ఈవీ వాహనాల అభివృద్దికి ఏకంగా 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు గ్యారంటీ ఇస్తామని హామీ ఇచ్చింది. దీంతో పాటు చైనా ప్రభుత్వం 2001లోనే “863 EV Project” పేరుతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించి ఈవీ వెహికల్స్ ఉత్పత్తిని ప్రోత్సహించింది. ప్రభుత్వ ప్రోత్సహంతో చైనా ఈవీ ఇండస్ట్రీస్ క్రమంగా బలపడింది. చైనా ఈవీ కార్లు ప్రపంచ మార్కెట్లను శాసించే స్థాయికి ఎదిగాయి. అమెరికాకు చెందిన టెస్టాకు కూడా గట్టిపోటీ ఇస్తున్నాయి. ఇక చైనా ఎలక్ర్టిక్ కార్ల తయారీ కంపనీలు కార్ల బ్యాటరీల్లో వాడే గ్రాఫైట్ ప్రొడక్షన్లో 62 శాతం వాటాను ఆక్రమించాయి. దీంతో పాటు చైనాలో కార్మికుల వేతనాలు తక్కువ కాబట్టి టస్లా లాంటి కంపెనీలకు గట్టి పోటీ ఇవ్వగలుగుతున్నాయి. ఇక్కడ గమనించాల్సింది… చైనా, ఇండియా, వియత్నాంలో కార్మికుల వేతనాలు చాలా చాలా తక్కువ. అదే అమెరికాలో అయితే వేతనాలు చాలా చాలా ఎక్కువ. అందుకే మస్క్కు కూడా చైనాతో పాటు మెక్సికోలో ప్లాంట్లను పెట్టి అక్కడి నుంచి దిగుమతి చేసుకుంటున్నాడు. ఇండియలో కూడా త్వరలోనే ప్లాంట్ పెట్టాలనుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే రెండు రోజుల క్రితం ఇండియన్ మీడియాలో .. మస్క్ ఇండియాలో ప్లాంట్ పెట్టడానికి ఆసక్తి చూపడం లేదని వార్త వచ్చింది. మరి మస్క్ మాత్రం దీని గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఇక చైనా ఈవీ మార్కెట్లో ధరల యుద్ధం జరుగుతోంది. అమ్మకాలు పెంచుకోవడానికి కంపెనీలు పోటీ పడి ధరలు తగ్గించుకుంటున్నాయి. 2015 నుంచి 2022 వరకు చైనా కంపెనీలు ఈవీ కార్లపై 50 శాతం వరకు ధర తగ్గించాయి. ఇక్కడ ఉదాహరణ చెప్పుకోవాలంటే 67వేల యూరోలుండే కారు ధర ప్రస్తుతం 32 యూరోలకు తగ్గించాయి చైనా కంపెనీలు. అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశం ఏమిటంటే ఇదే ఏడేళ్ల కాలంలో అమెరికాలో 12.5 శాతం, యూరోప్లు 17 శాతం చొప్పున ధరలు పెంచేశాయి. అయితే చైనా ప్రైజ్ వార్ విషయానికి వస్తే స్వల్పకాలంలో కొన్ని ఇబ్బందులు ఉన్నా. దీర్ఘకాలంలో మార్కెట్లో ఏకచత్రాధిపత్యం కొనసాగించవచ్చునని భావిస్తోంది. తాత్కాలికంగా లాభాలపై కొంత ప్రభావం చూపించినా.. దీర్ఘకాలంలో మార్కెట్లో నిలదొక్కుకుంటే లాభాలు ఆర్జించవచ్చుననే కాన్సెప్ట్తో ఉన్నాయి చైనా కంపెనీలు.
ఇక చైనా కార్ల ప్రైజ్ వార్ ఇంటర్నేషనల్ మార్కెట్లో ప్రకంపనలు సృష్టిస్తోది. దీనికి ఉదాహరణకు చెప్పుకోవాలంటే బీవైడీ ఆట్టో 3 కారు తయారీకి 19వేల283 డాలర్లు అయితే జర్మనీలో ఈ కారు 42వేల789కి విక్రయిస్తోంది. అయినా.. జర్మనీలో ఇది ప్రీమియం కారు కిందికి వస్తుంది. ఇక అమెరికా విషయానికి వస్తే చైనా నుంచి దిగుమతి చేసుకొనే వస్తువులపై 100 శాతం టారిఫ్ విధిస్తామని ప్రకటించింది. అయితే యూరోపియన యూనియన్ దేశాలు మాత్రం చైనా కార్లపై టారిఫ్ 26 నుంచి 48 శాతం పెంచాలనే ఆలోచనలో ఉన్నాయి. ఇక ఇటు అమెరికా ప్రభుత్వమైనా.. లేదా యూరోపియన్ యూనియన్ అయినా. … సుంకాలు పెంచితే కార్ల ధరలు పెరుగుతాయి. ఒక వేళ అమెరికా ఈవీ కార్లపై సరాసరి 13.5 శాతం పన్ను విధిస్తే కార్ల ధర దాదాపు 6వేల400 డాలర్ల వరకు పెరిగే అవకాశాలున్నాయి. ఇక చైనాలో ఈవీ కార్ల ధరలు పెట్రోల్ కార్ల కంటే దాదాపు 33 శాతం చౌక అదే అమెరికా, యూరోప్తో పోల్చుకుంటే వరుసగా 27 శాతం, 43 శాతం ఖరీదైనవిగా తేలాయి.
ఇక చైనా ఆటోతయారీ కంపెనీలు ఈ ఏడాది ఏప్రిల్లో కార్ల ధరలను ఏకంగా 16.8 శాతం తగ్గించాయి. గత ఏడాది అంటే 2024తో పోల్చుకుంటే సరాసరి రెట్టింపు ధర తగ్గించినట్లు అయ్యింది. దీంతో ఆటో ఇండస్ర్టీ లాభాల మార్జిన్ కూడా గణనీయంగా తగ్గింది. ఇక మార్కెట్లో తమ వాటా పడిపోకుండా ఉండేందుకు కంపెనీలు ధరలు తగ్గించుకుంటూ పోతే.. కంపెనీ ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని చైనా ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఉన్న లిక్విడిటీ కాస్తా ఆవిరై ఎవర్గ్రాండే స్థాయికి చేరుకొనే అవకాశాలున్నాయని హెచ్చరిస్తోంది. చైనాలో రియల్ ఎస్టేట్ కంపెనీ ఎవర్గ్రాండ్ ఇలానే దివాలా తీసిందని గుర్తు చేస్తోంది. మరి బీవైడీకి ఇది వేకప్ కాల్ కాబోతోందా లేదా అనేది కాలమే చెప్పాలి.