Published On:

Pakistan Fearing: యుద్ధ భయంలో పాకిస్తాన్.. కరాచీ, లాహోర్ ఎయిర్ స్పేస్ మూసివేత

Pakistan Fearing: యుద్ధ భయంలో పాకిస్తాన్.. కరాచీ, లాహోర్ ఎయిర్ స్పేస్ మూసివేత

Air space: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాశ్మీర్ పర్యటనకు వచ్చిన 26 మంది పర్యాటకులను లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతమార్చారు. దాడి అనంతరం భారత్ తమ దేశంపై ప్రతీకారం తీర్చుకుంటుందేమోనని దాయాది దేశం క్షణక్షణం భయంతో వణికిపోతోంది. పైకి ధీమాగా ఉన్నట్టు ప్రకటనలు చేస్తున్నా.. లోలోపల ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతోంది. ఈ నేపథ్యంలోనే యుద్ధానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది. మరోవైపు భారత సరిహద్దులో సైనిక బలగాలను, యుద్ధ ట్యాంకర్లను మొహరించింది.

ఈ నేపథ్యంలోనే పాక్ ఆక్రమిత కాశ్మీర్, గిల్గిత్ ప్రాంతాలకు ఇస్లామాబాద్, లాహోర్, కరాచీ నుంచి వెళ్లే విమానాలను రద్దు చేసింది. భద్రతా కారణాలను సాకుగా చూపి నేటి నుంచి మే 31 వరకు కరాచీ, లాహోర్ ఎయిర్ స్పేస్ మూసివేస్తున్నట్టు పాక్ విమానయాన అధికారులు ప్రకటించారు. ఈ మేరకు పాకిస్తాన్ ఎయిర్ పోర్ట్ అథారిటీ నోటీసులు జారీ చేసింది. ఉత్తర్వుల ప్రకారం ఈ నెలాఖరు వరకు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిషేధం అమలులో ఉండనుంది.

అయితే భారత్ ఈ వ్యవహారంపై వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ పై నేరుగా యుద్ధం చేయకుండా వాణిజ్య, దౌత్య సంబంధాలపై ప్రభావం పడేలా నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో భాగంగానే సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకోవడంతోపాటు.. భారత్ లో ఉంటున్న పాకిస్తాన్ వాసుల వీసాలను రద్దు చేసింది. అలాగే పాకిస్తాన్ విమానాలు ప్రయాణించకుండా భారత గగనతలాన్ని మూసివేసింది.