Flight : సూది గుచ్చుకుంది నష్టపరిహారం ఇవ్వండి.. ఎయిర్లైన్స్పై ప్రయాణికుడి దావా

Flight : విమానంలో ప్రయాణిస్తున్న కొందరి ప్రయాణికులకు చేదు, అనుభవాలు, వివిధ ఘటనలు ఎదురు అవుతుంటాయి. తోటి ప్రయాణికుల వికృత చేష్టలు, సిబ్బంది అందించే సౌకర్యాలు.. ఇలా ఎన్నో ఉంటాయి. కానీ చైనా దేశానికి చెందిన వ్యక్తి విమానంలో ప్రయాణిస్తున్నాడు. అతడు కూర్చొన్న సీటులో వాడేసిన సూది ఉంది. అతడికి గుచ్చుకోవడంతో ఆ వ్యక్తి ఎయిర్లైన్స్పై నష్ట పరిహారం కోసం దావా వేశాడు. ఈ సంఘటన చైనా సౌతర్న్ ఎయిర్లైన్స్లో జరిగింది.
ఇటీవల ఘటన..
ఇటీవల ఫు అనే వ్యక్తి విమానంలో ప్రయాణించాడు. సీటులో కూర్చొన్న అతడు తన ప్యాంట్ జేబులో నుంచి సెల్ఫోన్ తీసుకునేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో అతడి వేలికి పదునైన వస్తువు గుచ్చుకున్నట్లు అనిపించింది. దీంతో అతడు ఇన్సులిన్ ఇంజెక్షన్కు వాడిన సూదిగా గుర్తించాడు. వెంటనే విమానంలో ఉన్న సిబ్బందికి విషయాన్ని వివరించాడు. సిబ్బంది అతడికి ప్రథమ చికిత్స చేశారు. గతంలో ఆ సీటులో కూర్చొన్న ఓ ప్రయాణికుడు ఇంజెక్షన్ను అక్కడే వదిలేసినట్లు దర్యాప్తులో తేలిందని మీడియా కథనాలు పేర్కొన్నాయి.
బాధితుడికి టికెట్ ధర వాపస్..
విమానం ల్యాండింగ్ తర్వాత బాధితుడికి టికెట్ ధరను వాపస్ ఇవ్వడంతోపాటు అదనంగా కొంత మొత్తాన్ని అందించింది. కానీ ఘటన ద్వారా తాను ఎంతో మానసిక క్షోభకు గురయ్యానని బాధితుడు తెలిపాడు. భవిష్యత్లో అవసరమైతే చికిత్సకు ఖర్చునుకూడా ఎయిర్లైన్స్ భరించాలని కోరాడు. 1,30,000 యువాన్లు (రూ. 15 లక్షలకు పైగా) చెల్లించాలని డిమాండ్ చేశాడు. దీనిని సదరు సంస్థ నిరాకరించింది. దీంతో అతడు న్యాయస్థానంలో కూడా దావా వేశాడు.
బాధితుడి డిమండ్లు అంగీకరం..
అనంతరం సదరు సంస్థ బాధితుడి డిమాండ్లను అంగీకరించినట్లు కథనాలు తెలిపాయి. జరిగిన ఘటననకు క్షమాపణలు కోరింది. ప్రయాణికులకు ఎలాంటి హాని కలిగించకుండా పరిశుభ్రత విషయంలో కఠిన చర్యలు తీసుకుంటామని, బాధితుడిని క్షమాపణలు కోరామని పేర్కొంది. అతడి వైద్య ఖర్చులను కూడా భరిస్తామని ఒక ప్రకటనలో పేర్కొంది.