Tirumala: కిక్కిరిసిన తిరుమల.. దర్శనానికి 24 గంటల సమయం

Piligrims: తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. స్వామి వారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఓ వైపు వేసవి ముగింపు దశకు చేరుకోవడం, విద్యార్థుల ఫలితాలు వెలువడటం, పెళ్లిళ్లు, శుభకార్యాలు జరగుతుండడంతో భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకునేందుకు తిరుమల వస్తున్నారు. దీంతో తిరుమల భక్తులతో కిక్కిరిసింది. దీంతో వైకుంఠం క్యూ క్లాంపెక్స్ లోని కంపార్టుమెంట్లు అన్నీ భక్తులతో నిండిపోయాయి. చివరికి వెలుపల వరకు భక్తులు వేచి ఉన్నారు. దీంతో స్వామి వారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది.
కాగా నిన్న స్వామివారిని 69,019 మంది భక్తులు దర్శించుకున్నారు. 37774 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. నిన్న స్వామివారి హుండీ ఆదాయం రూ. 3.42 కోట్లు వచ్చినట్టు టీటీడీ ప్రకటించింది. ఇక భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో టీటీడీ అధికారులు భక్తులకు తాగునీరు, ఆహారం, పాలు, అందించారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శ్రీవారి భక్తులు, వాలంటీర్లతో భద్రతా ఏర్పాట్లు చేశారు.