IPL 2025 Resume Date: ఐపీఎల్ పున:ప్రారంభమైతే విదేశీ ఆటగాళ్లు తిరిగి వస్తారు: ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్

Chairman Arun Dhumal Meets withe IPL franchise Owners on IPL 2025 Resume: భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలకు ఎట్టకేలకు తెరపడింది. కాల్పుల విరమణకు రెండు దేశాలూ అంగీకరించాయి. దీంతో తాత్కాలికంగా బ్రేక్ పడిన ఐపీఎల్ను తిరిగి ప్రారంభించడంపై బీసీసీఐ దృష్టిసారించింది. ఐపీఎల్ మ్యాచ్లపై చర్చించేందుకు వాటాదారులు, ఫ్రాంఛైజీ యజమానులతో బీసీసీఐ ఈ రోజు సమావేశం కానుంది. భారత్, పాక్ దేశాల మధ్య ఉద్రిక్తతల కారణంగా ఐపీఎల్ వారం రోజులపాటు వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీంతో విదేశీ ఆటగాళ్లు, సహాయ సిబ్బంది ఇండియాను వీడుతున్నారు. ఇప్పటికే చాలా మంది క్రీడాకారులు స్వదేశానికి వెళ్లారు. టోర్నీ వెంటనే తిరిగి ప్రారంభమైతే విదేశీ ఆటగాళ్లు తప్పకుండా ఇండియాకు తిరిగి వస్తారని ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ విశ్వాసం వ్యక్తం చేశారు.
ఐపీఎల్లో పాల్గొంటారని నమ్మకం ఉంది..
విదేశీ క్రీడాకారులు తిరిగి ఇండియాకు వచ్చి ఐపీఎల్లో పాల్గొంటారని నమ్మకం ఉందని చెప్పారు. ఐపీఎల్ వారంపాటు వాయిదా పడినందుకు ప్రతిఒక్కరూ తమ కుటుంబసభ్యుల వద్దకు వెళ్లాలని కోరుకున్నారని తెలిపారు. తాము పరిస్థితిని సమీక్షిస్తున్నామని చెప్పారు. తదనుగుణంగా ఫ్రాంఛైజీల యజమానులు, వాటాదారులకు సమాచారం ఇస్తామని పేర్కొన్నారు.
మిగిలిన మ్యాచ్లు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు బీసీసీఐని సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై ఐపీఎల్ చైర్మన్ స్పందించారు. తాను కూడా ఈ న్యూస్ విన్నానని చెప్పారు. కానీ, తాము ఎవరితో సంప్రదింపులు జరపలేదని స్పష్టం చేశారు. ఇతర దేశాలు ప్రతిష్ఠాత్మకమైన టోర్నమెంట్ను నిర్వహించడానికి సిద్ధంగా ఉండటం సంతోషించదగిని విషయమని అరుణ్ ధుమాల్ పేర్కొన్నారు. ఈ సీజన్లో ప్లే ఆఫ్స్తో కలిపి ఇంకా 16 మ్యాచ్లు జరగాల్సి ఉంది.