Vijay : విద్యార్థులు మనసును పాడుచేసుకోవద్దు : హీరో విజయ్

Hero Vijay : కుల, మత అంశాలతో మనసును పాడుచేసుకోవద్దంటూ ‘తమిళగ వెట్రి కళగం అధినేత, హీరో విజయ్ విద్యార్థులకు సూచించారు. కులం, మంతం ఆధారంగా విభజనను తోసిపుచ్చాలని ఆయన కోరారు. 10, 12 తరగతుల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను సత్కరించారు. అనంతరం విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ప్రకృతికి మతం, కులం ఉన్నాయా..? అని ప్రశ్నించారు.
చెన్నైలో నిర్వహించిన కార్యక్రమంలో విజయ్ మాట్లాడారు. ప్రజాస్వామ్యం అందరికీ సమాన అవకాశాలు ఇచ్చిందన్నారు. ప్రజాస్వామిక విలువలను పాటించాలని కుటుంబ సభ్యులకు చెప్పాలని సూచించారు. అవినీతి కార్యకలాపాలకు దూరంగా ఉండే వ్యక్తులకు ఓటు వేయాలని సూచించాలన్నారు. కులం, మతం ఆధారంగా విభజనను తోసిపుచ్చాలని కోరారు. కులం, మతం అంశాలతో మనసు పాడుచేసుకోవద్దని సూచించారు. ప్రకృతికి ఆ భేదం ఉందా..? అని ప్రశ్నించారు. డ్రగ్స్ను దూరం పెట్టినట్టే కులం, మతం వంటి వాటిని దరిచేరనీయొద్దన్నారు. ప్రజాస్వామ్యం ఉన్నప్పుడే ఈ ప్రపంచంలో స్వేచ్ఛ ఉంటుందన్నారు.
ఇదిలా ఉంటే, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్నాయి. టీవీకేతో సహా ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచి కసరత్తు మొదలు పెట్టాయి. రాష్ట్రంలో విజయ్ అధికార డీఎంకేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బీజేపీపై విమర్శనాస్త్రాలను సంధిస్తున్నారు.