Rajnath Singh : పాక్ ఉగ్రవాదులను నాశనం చేసేందుకు ఏ పద్ధతినైనా అనుసరిస్తాం : రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్

Defence Minister Rajnath Singh : యుద్ధనౌక ఐఎన్ఎస్ విక్రాంత్ను శుక్రవారం ఉదయం రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ సందర్శించారు. నేవీ సైనికులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. తక్కువ సమయంలో పాక్ ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశామని చెప్పారు. భారత్ ఎంతో శక్తివంతమైన దాడి చేసిందన్నారు. దాడులను విరమించుకునేలా చేయాలని పాక్ ప్రపంచ దేశాలను వేడుకున్నదని తెలిపారు. భారత్ సైనిక దళాలు ఎంతో వేగంగా దాడులు చేశాయని చెప్పారు. ఆపరేషన్ సింధూర్తో ఉగ్రవాదులకే కాదని, వాళ్లను పెంచి పోషించే వాళ్లకు స్పష్టమైన సందేశం ఇచ్చినట్లు తెలిపారు.
ఆపరేషన్ సింధూర్లో భారతీయ నౌకాదళ పాత్ర అద్భుతమని కొనియాడారు. పాకిస్థాన్ నేలపై ఉన్న ఉగ్ర స్థావరాలను ఐఏఎఫ్ ధ్వంసం చేసిందన్నారు. ఆరేబియా సముద్రంలో ఉన్న భారత యుద్ధ నౌకలు పాకిస్థాన్ నేవీని తీరానికి పరిమితం చేశాయన్నారు. ఆపరేషన్ సిందూర్ కేవలం సైనిక చర్య మాత్రమే కాదని, ఉగ్రవాదంపై అది మూకుమ్మడి దాడి అన్నారు. పాకిస్థాన్ ఉగ్రవాదులను నాశనం చేసేందుకు ఏ పద్ధతినైనా అనుసరిస్తామని చెప్పుకొచ్చారు. పాకిస్థాన్ ఊహించలేని పద్ధతుల్లో చర్యలు ఉంటాయని హెచ్చరించారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి పాక్ ఆడుతున్న ప్రమాదకర ఉగ్రవాద ఆట ఇప్పుడు ముగిసిందని చెప్పారు.