Sharmishta Panoli : సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ శర్మిష్ఠ పనౌలీకి మధ్యంతర బెయిల్
Sharmishta Panoli : సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, న్యాయ విద్యార్థిని శర్మిష్ఠ పనౌలీ (22)కి మధ్యంతర బెయిల్ మంజూరైంది. ఆపరేషన్ సిందూర్పై సామాజిక మాధ్యమాల్లో తన భావాలను వెల్లడించే క్రమంలో ఒక వర్గాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై అరెస్టు అయ్యారు. తాజాగా ఆమెకు కోల్కతా హైకోర్టు గురువారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు మే 31వ తేదీన ఆమెను కోల్కతా పోలీసులు అరెస్టు చేయడంతో తీవ్ర రాజకీయ దుమారం చెలరేగింది. గత శనివారం న్యాయస్థానం ఆమెకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించగా, ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్నారు.
ఎవరీ ఈమె?
కోల్కతాలోని ఆనందపుర్ ప్రాంతానికి చెందిన శర్మిష్ఠ పుణె న్యాయ విశ్వవిద్యాలయంలో నాలుగో సంవత్సరం విద్యనభ్యసిస్తోంది. లింక్డిన్ ప్రొఫెల్ ప్రకారం ఆమెకు ఇన్స్టాలో 94 వేలమంది ఫాలోవర్లు ఉన్నారు. రాజకీయాలపై తనదైన శైలిలో వ్యాఖ్యలు జోడించి అభిప్రాయాలను చెప్పడం ద్వారా శర్మిష్ఠ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా పేరు సాధించింది.
కేంద్రం చేపట్టిన ఆపరేషన్ సిందూర్పై బాలీవుడ్ ప్రముఖుల మౌనాన్ని ప్రశ్నిస్తూ మే 14న పోస్టు చేసిన వీడియో తీవ్ర వివాదాస్పదమై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో తన పోస్టులు, రీల్స్ తొలగించి క్షమాపణలు కోరారు. శర్మిష్ఠను అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వచ్చాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆమె గురుగ్రామ్లో ఉన్నట్లు ట్రాక్ చేసి శుక్రవారం అరెస్టు చేశారు.