Air India : ఆ ముగ్గురిని తొలగించండి.. ఎయిర్ ఇండియాకు డీజీసీఏ ఆదేశాలు

Air India plane crash: ఈ నెల 12న గుజరాత్లోని అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో 270 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. భద్రతా లోపానికి కారణమైన ముగ్గురు ఉద్యోగులను తొలగించాలని ఎయిర్ ఇండియాను ఆదేశించింది. విషయాన్ని సంబంధిత వర్గాలు శనివారం వెల్లడించాయి. ముగ్గురు అధికారుల్లో ఎయిర్లైన్ డివిజనల్ వైస్ ప్రెసిడెంట్ ఉన్నట్లు తెలిసింది.
అహ్మదాబాద్ నుంచి లండన్ బయలు దేరిన ఎయిర్ ఇండియా విమానం విమానాశ్రయానికి సమీపంలోని ఓ బిల్డింగ్పై కుప్పకూలింది. విమానం కూలిన అనంతరం 1,000 డిగ్రీల ఉష్ణోగ్రతతో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 270 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. ఈ ఘటనలో మృతదేహాల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో డీఎన్ఏ పరీక్ష ద్వారా మృతదేహాలను అధికారులు గుర్తిస్తున్నారు. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నారు.