PM Modi with NDA CM’s: ఎన్డీఏ పాలిత సీఎంలతో పీఎం భేటీ.. పలు అంశాలపై చర్చ!

PM Modi Meeting with NDA CM’s: ప్రధాని మోదీ ఇవాళ ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలతో సమావేశం నిర్వహించారు. ఢిల్లీలో జరిగిన ఈ మీటింగ్ కు పలువురు కేంద్రమంత్రులు కూడా హాజరయ్యారు. సమావేశంలో ముఖ్యంగా ఆపరేషన్ సిందూర్ కు సంబంధించిన వివరాలను కేంద్ర మంత్రులు సీఎంలు, డిప్యూటీ సీఎంలకు వివరించినట్టు తెలుస్తోంది.
మరోవైపు సమావేశంలో రెండు తీర్మానాలను ఆమోదించారు. ఆపరేషన్ సిందూర్ విజయంపై ప్రధాని మోదీని అభినందిస్తూ ఓ తీర్మానం, దేశంలో కులగణన చేపట్టడంపై మరో తీర్మానం ఆమోదించినట్టు తెలుస్తోంది. అలాగే ఆపరేషన్ సిందూర్ పై విపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టే అంశంపై కూడా నేతలు చర్చించారు. సమావేశానికి ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు కూడా హాజరయ్యారు. అలాగే జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా సమావేశంలో పాల్గొన్నారు.
కాగా పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్ లోని ఉగ్రస్థావరాలపై దాడులు చేసింది. ఇందులో 100 మందికిపైగా ముష్కరులు హతమయ్యారు. దీంతో దేశవ్యాప్తంగానే కాక, ప్రపంచవ్యాప్తంగా భారత్ కు మద్దతు లభించింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరిపే పోరులో భారత్ కు మద్దతిస్తామని పలు దేశాలు ప్రకటించాయి.