Published On:

G7 Summit : కెనడాలో 15 నుంచి 17 వరకు జీ7 సదస్సు.. భారత్‌కు అందని ఆహ్వానం.. ఆరేళ్లలో ఇదే తొలిసారి

G7 Summit : కెనడాలో 15 నుంచి 17 వరకు జీ7 సదస్సు.. భారత్‌కు అందని ఆహ్వానం.. ఆరేళ్లలో ఇదే తొలిసారి

G7 Summit : కెనడాలోని అల్బెర్టాలో ఈ నెల 15వ తేదీ నుంచి 17 వరకు జీ7 సదస్సు జరగున్నది. ఈ సదస్సుకు భారత్‌కు ఇంకా ఆహ్వానం అందలేదు. దీంతో ఆరేళ్లలో తొలిసారి సదస్సుకు ప్రధాని మోదీ దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామంపై కాంగ్రెస్‌ విమర్శలు గుప్పించింది. భారత్-పాకిస్థాన్‌ల మధ్య మధ్యవర్తిత్వం చేయడానికి అమెరికాను అనుమతించిన తర్వాత ఇది మరో దౌత్యపరమైన భంగపాటేనని పేర్కొంది.

 

సదస్సులో పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులు, రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య కొనసాగుతున్న యుద్ధంతోపాటు ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చించే అవకాశం ఉంది. సదస్సుకు ప్రధాని మోదీ హాజరయ్యే అవకాశం లేదని సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. శిఖరాగ్ర సమావేశానికి మోదీకి ఇంకా ఆహ్వానం పంపలేదని తెలిసింది. ఆహ్వానం వచ్చినా ప్రస్తుతం రెండుదేశాల మధ్య నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో మోదీ అక్కడికి వెళ్లకపోవచ్చనే వాదన ఉంది. దీంతో జీ7లో ప్రధాని పాల్గొనకపోవడం ఆరేళ్లలో తొలిసారి అవుతుంది.

 

ఇదే అంశంపై కాంగ్రెస్‌ విమర్శలు గుప్పించింది. అమెరికా, ఫ్రాన్స్‌, బ్రిటన్‌, జపాన్‌, ఇటలీ, కెనడాతోపాటు జర్మనీ అధినేతలు జీ7 సదస్సులో పాల్గొననున్నారని తెలిపింది. బ్రెజిల్‌, మెక్సికో, దక్షిణాఫ్రికా, ఉక్రెయిన్‌, ఆస్ట్రేలియా దేశాల అధినేతలకు ఆహ్వానం అందిందని కాంగ్రెస్‌ పార్టీ జనరల్‌ సెక్రటరీ జైరాం రమేశ్‌ వెల్లడించారు. 2014కు ముందుకు జీ8గా ఉండేదని, నాటి ప్రధాని మన్మోహన్‌కు అప్పట్లో ఆహ్వానం వచ్చేదన్నారు. 2014 తర్వాత ఈ సంప్రదాయం కొనసాగినప్పటికీ ఆరేళ్లలో తొలిసారి ప్రధాని మోదీకి ఆహ్వానం అందలేదన్నారు. దౌత్యపరంగా ఇదో భంగపాటేనన్నారు.

 

ఇదిలా ఉంటే.. జీ7 దేశాల్లో భారత్‌ లేకున్నప్పటికీ నిర్వహణ దేశాల ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ శిఖరాగ్ర సదస్సుల్లో పాల్గొంటున్నారు. గతేడాది ఇటలీ వేదికగా జరిగిన సదస్సుకు భారత్‌తోపాటు ఆఫ్రికా, దక్షిణఅమెరికా, పలు అభివృద్ధి చెందుతున్న దేశాలు పాల్గొన్నాయి. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పాల్గొని తన గళాన్ని వినిపించారు.

ఇవి కూడా చదవండి: