PM Modi: జూన్ 6న జమ్ముకాశ్మీర్ కు ప్రధాని.. భద్రత కట్టుదిట్టం
JK: ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 6న జమ్ముకాశ్మీర్ లో పర్యటించనున్నారు. కాగా పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం తొలిసారిగా ప్రధాని జమ్ముకాశ్మీర్ పర్యటనకు వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరుకానున్నారు. ముందుగా శ్రీనగర్ కు వందేభారత్ రైలును జెండా ఊపి ప్రారంభించనున్నారు. అయితే ఏప్రిల్ 19నే ఈ కార్యక్రమం చేపట్టాల్సి ఉంది. కానీ అప్పుడు పరిస్థితులు అనుకూలించకపోవడంతో ప్రోగ్రాం వాయిదా పడింది. అనంతరం ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడి జరగడంతో రాష్ట్రంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. రాష్ట్రమంతా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
అయితే తాజాగా జూన్ 6న జరిగే ప్రధాని పర్యటనలో చినాబ్ నదిపై నిర్మించిన రైల్వే వంతెనను ప్రారంభిస్తారు. అలాగే పలు కార్యక్రమాల అనంతరం కాశ్మీర్ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మాట్లాడనున్నారు. కాగా ఉగ్రవాదం అణచివేతపై రాష్ట్ర ప్రజలకు ప్రధాని కీలక సందేశం ఇవ్వనున్నారని సమాచారం. మరోవైపు పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం రాష్ట్రంలో పరిస్థితులు మారిపోయాయి. జమ్ముకాశ్మీర్ పర్యటకం పూర్తిగా దెబ్బతింది. అలాగే రాష్ట్రానికి వచ్చే పర్యాటకుల సంఖ్య కూడా చాలా స్వల్పంగా ఉంది. దీంతో స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కరువయ్యాయి. మరోవైపు ఉగ్రవాదల ఏరివేతే లక్ష్యంగా భద్రతా బలగాలు రాష్ట్రంలోని ఏదో ఒక చోట నిత్యం సెర్చ్ ఆపరేషన్ చేస్తూనే ఉన్నాయి. ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే జమ్ముకాశ్మీర్ పర్యటన కోసం ప్రధాని వస్తున్న నేపథ్యంలో అధికారులు భారీ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు.