Published On:

Monsoon Waves Entered: గుడ్ న్యూస్.. కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు

Monsoon Waves Entered: గుడ్ న్యూస్.. కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు

Monsoon Waves Enters into Kerala: దేశవ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు ఇవాళ కేరళను తాకాయి. ప్రతి ఏటా జూన్ 1 తర్వాత వచ్చే రుతుపవనాలు ఈసారి ఎనిమిది రోజుల ముందుగానే కేరళలోకి ప్రవేశించినట్టుగా భారత వాతావరణశాఖ తెలిపింది. దాదాపు 16 ఏళ్ల తర్వాత నైరుతి రుతుపవనాలు ఇంత త్వరగా రావడం ఇదే తొలిసారి అని అధికారులు తెలిపారు. రుతుపవనాల రాకతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ పనులు మొదలు పెట్టేందుకు రెడీ అవుతున్నారు.

 

మరోవైపు అరేబియా సముద్రంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఈనెల 27నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణలో వచ్చే నాలుగు రోజులపాటు వర్షాలు కురుస్తాయని చెప్పింది. ముఖ్యంగా నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, ములుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులతో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

 

ఇక ఏపీలోనూ అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణశాఖ చెప్పింది. ముఖ్యంగా శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి జిల్లా, తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపురం, శ్రీసత్యసాయి, నంద్యాల, అన్నమయ్య జిల్లాల్లో వచ్చే రెండు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో పిడుగులతో వర్షాలు పడొచ్చని అధికారులు తెలిపారు. అలాగే తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయని చెప్పారు.

 

మరోవైపు అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు పడుతున్నాయి. చెన్నై, కాంచీపురం జిల్లాలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముందు జాగ్రత్తగా 10 విమాన సర్వీసులను అధికారులు రద్దు చేశారు. ఇక కేరళ, కర్నాటక, గోవా, మహారాష్ట్రను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వచ్చే నాలుగురోజులపాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ తెలిపింది.