India – Pakistan War: భారత్ దెబ్బ అదుర్స్.. పాక్ లో 8 సైనిక స్థావరాలు ఖతం

Indian Army Destroyed 8 Pakistan Army posts in Operation Sindoor: భారత్- పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పహల్గామ్ ఉగ్రదాడిలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు జమ్ముకాశ్మీర్ 26 మంది అమాయక పర్యాటకులను పొట్టనబెట్టుకున్నారు. దాంతో ఉగ్రవాదులపై ఆగ్రహం వ్యక్తం చేసిన భారత్.. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా ఆపరేషన్ సిందూర్ పేరుతో దాడులు జరిపింది. ఇందులో జేషే మహ్మద్, లష్కరే తోయిబాకు చెదంిన 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. కాగా ఆపరేషన్ సిందూర్ అనంతరం పాకిస్తాన్ భారత్ పై అక్కసు వెల్లగక్కుతోంది. దేశంలోని పలు ప్రాంతాలను టార్గెట్ చేసుకుని డ్రోన్లు, మిస్సైళ్లతో దాడులు చేస్తోంది. అలాగే సరిహద్దుల వెంబడి కాల్పులు జరుపుతోంది. పాక్ చర్యలకు భారత్ గట్టిగా బదులిస్తోంది.
రెండు రోజులుగా భారత్ లోని పలు ప్రాంతాలపై పాకిస్తాన్ దాడులు చేసింది. వీటిని భారత రక్షణ వ్యవస్థ ధీటుగా ఎదుర్కొంది. అలాగే దేశంలో పలు ప్రాంతాలను భారత ప్రభుత్వం బ్లాక్ అవుట్ చేసింది. అయా ప్రాంతాల్లో కరెంట్ సరఫరాను నిలిపివేసింది. దీంతోపాటే హై అలర్ట్ ప్రకటించింది.
ఇక పాకిస్తాన్ జరుపుతున్న దాడులకు సమాధానంగా భారత్ కూడా దాడులు చేస్తోంది. అందులో భాగంగానే పాకిస్తాన్ లోని 8 సైనిక స్థావరాలపై భారత వైమానిక దళానికి చెందిన విమానాలు దాడులు చేసి వాటిని ధ్వంసం చేశాయి. రాడర్ యూనిట్లు, మందుగుండు సామాగ్రి డంప్ లను ఎయిర్ లాంచ్డ్ ప్రెసిషన్ ఆయుధాలతో నాశనం చేశాయి. భారత్ దాడుల్లో రఫీకి, మురిద్, చక్లాలా, రహీం యార్ ఖాన్, సుక్కూర్, చునియన్, సియాల్ కోట్, పస్రూర్ సైనిక స్థావరాలు నేలమట్టమయ్యాయని వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ తెలిపారు. అలాగే భారత్ ఇవాళ చేపట్టిన దాడుల్లో పాకిస్తాన్ లోని సాంకేతిక సదుపాయాలు, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లు, రాడార్ సైట్లు, ఆయుధ నిల్వ ప్రాంతాలు ధ్వంసమయ్యాయని కల్నల్ సోఫియా ఖురేషి చెప్పారు.