MLC Kavitha : కేసీఆర్కు ఒక కన్ను బీఆర్ఎస్.. రెండో కన్ను ‘జాగృతి’: ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha inaugurates new office of ‘Telangana Jagruti’ : తెలంగాణ రాష్ట్ర ప్రజల గొంతుకగా తెలంగాణ జాగృతి సంస్థ పనిచేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. బంజారాహిల్స్లో ఏర్పాటు చేసిన ‘తెలంగాణ జాగృతి’ నూతన కార్యాలయాన్ని ఆమె ప్రారంభించి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్, ప్రొఫెసర్ జయశంకర్ స్ఫూర్తితో జాగృతి సంస్థ ఏర్పడిందని చెప్పారు. సంస్థను ప్రారంభించి 18 ఏళ్లు అయిందన్నారు. ఇంతకుముందు అశోక్నగర్లో జాగృతి కార్యాలయం ఉండేదని, ఇప్పుడు బంజారాహిల్స్కు మార్చినట్లు పేర్కొన్నారు. ఇక నుంచి ఇక్కడి నుంచి సంస్థ కార్యకలాపాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఇన్నేళ్ల ప్రయాణంలో ఎంతోమంది ఆశీస్సులు అందించారని గుర్తుచేశారు. తాము చేసిన ఉద్యమాలతో చాలా జీవోలు వచ్చాయన్నారు. పదేళ్ల కేసీఆర్ పాలనకు ఇప్పటి కాంగ్రెస్ పాలనకు ఎంతో తేడా ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇప్పటికైనా ‘జై తెలంగాణ’ అనాలని డిమాండ్ చేశారు. తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించాలని కోరారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజైనా రేవంత్ ‘జై తెలంగాణ’ అనాలని కోరారు.
జూన్ 2వ తేదీన రాజీవ్ యువ వికాసం పథకం ఎందుకు తెస్తున్నారని చెప్పాలని డిమాండ్ చేశారు. రాజీవ్ గాంధీకి తెలంగాణకు ఏం సంబంధం ఉందని ప్రశ్నించారు. తెలంగాణ యువ వికాసం అని ఉండాలని, రాజీవ్ యువ వికాసం అని ఉండకూడదని సూచించారు. కేసీఆర్కు రెండు కళ్లలా పనిచేస్తామన్నారు. ఒక కన్ను బీఆర్ఎస్ అయితే, రెండో కన్ను జాగృతి సంస్థ అన్నారు. కేసీఆర్పై ఈగ వాలినా ఊరుకోబోమన్నారు. కేసీఆర్కు నోటీసులు ఇచ్చారంటే యావత్ తెలంగాణకు నోటీసులు ఇచ్చినట్టే అన్నారు.
అది కాళేశ్వరం కమిషన్ కాదు.. కాంగ్రెస్ కమిషన్ అన్నారు. కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ జూన్ 4వ తేదీన ఇందిరా పార్కు వద్ద మహాధర్నా నిర్వహిస్తామన్నారు. బనకచర్ల ద్వారా ఏపీ ప్రభుత్వం నీళ్లు తీసుకుపోతుంటే సీఎం రేవంత్ ఏం చేస్తున్నారు? అని ప్రశ్నించారు. నదుల అనుసంధానాన్ని కేసీఆర్ వ్యతిరేకించారని, తుపాకుల గూడెం వద్ద రివర్ లింకేజీ ఉండాలని కేసీఆర్ సూచించారు. ఇచ్చింపల్లి వద్ద రివర్ లింకేజీ పెడతామని కేంద్రం చెప్పిందని, రాష్ట్రానికి కేసీఆర్ ఏం చేశారో ప్రజలందరికీ తెలుసన్నారు.
బంజారాహిల్స్ ఏర్పాటు చేసిన కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్, కేసీఆర్ ఫొటోలతో తెలంగాణ జాగృతి బ్యానర్ పెట్టారు. నూతన కార్యాలయంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్, జయశంకర్, తెలంగాణ తల్లి, జ్యోతిరావు ఫులే, సావిత్రిబాయి ఫూలే విగ్రహాలతోపాటు అమరవీరుల స్థూపాన్ని ఏర్పాటు చేశారు.