Covid-19 Cases in India: దేశంలో కరోనా పంజా.. రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు

Central Government alert to States on Covid-19 Cases: దేశంలో కరోనా వైరస్ రోజురోజుకు పంజా విసురుతోంది. క్రమక్రమంగా కేసుల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 270 పైగా కరోనా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా ఢిల్లీ, మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో కేసులు బయట పడుతున్నాయి. మరోవైపు తెలుగు రాష్ట్రా్ల్లోనూ కేసులు వెలుగు చూశాయి. ఏపీలో రెండు కేసులు బయటపడగా, తెలంగాణలో ఓ కేసు నమోదైంది. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇక దేశంలో కరోనా కేసులు పెరగడంపై కేంద్రం రియాక్ట్ అయింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. కరోనా నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఆస్పత్రుల్లో తగినన్ని బెడ్లు, ఆక్సిజన్ సిలిండర్లు, టెస్ట్ కిట్లు, వ్యాక్సిన్సు అందుబాటులో ఉంచుకోవాలని సూచించింది.
మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో మే నెలలోనే 23 కరోనా కేసులు నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. అయితే తాజాగా నమోదవుతున్న కరోనా వేరియంట్ పెద్ద ప్రమాదం లేదని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి పంకజ్ సింగ్ తెలిపారు. ముఖ్యంగా నోయిడా, ఘజియాబాద్ నగరాల్లో పాజిటీవ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.
ఇక దేశంలోనే అత్యధికంగా కేరళలో కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ అన్ని జిల్లాల అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రుల్లో మాస్క్ ను తప్పనిసరి చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జలుబు, దగ్గు లక్షణాలు ఉంటే మాస్క్ ధరించాలన్నారు. వ్యక్తిగత దూరం పాటించాలన్నారు. ఇక కర్నాటకలోనూ కరోనా పాజిటీవ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 35 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అలాగే ముంబైలో పెద్ద సంఖ్యలో కరోనా కేసులు బయటపడుతున్నాయి. ప్రస్తుతం ముంబైలోనే 95 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి.