Bomb Threat: విజయవాడ రైల్వేస్టేషన్ కు బాంబు బెదిరింపు.. ప్రజల ఆందోళన!

Bomb Threat to Vijayawada Railway Station: విజయవాడకు వరుస బాంబు బెదిరింపులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇవాళ ఉదయం బీసెంట్ రోడ్డులోని ఎల్ఐసీ బిల్డింగ్ వద్ద బాంబు పెట్టినట్టు బెదిరింపు కాల్స్ రావడంతో స్థానికంగా ఉన్న షాపులు మూసివేయించారు. పోలీసులు, బాంబ్ స్క్వాడ్ సిబ్బంది ముమ్మరంగా తనిఖీలు చేశారు. చివరికి బాంబు లేదని నిర్ధారించుకుని షాపులు తెరిచేందుకు అనుమతినిచ్చారు.
అనంతరం విజయవాడ రైల్వేస్టేషన్ లోనూ బాంబ్ పెట్టినట్టు రావడంతో రైల్వే పోలీసులు అప్రమత్తమయ్యారు. గుర్తు తెలియని వ్యక్తి పోలీస్ కంట్రోల్ రూమ్ కి కాల్ చేసి స్టేషన్ లో బాంబు పెట్టినట్టు చెప్పడంతో బాంబ్ స్క్వాడ్ బృందం రైల్వేస్టేషన్ మొత్తాన్ని తనిఖీ చేసింది. కంట్రోల్ రూమ్ కి మహారాష్ట్రలోని లాతూర్ లొకేషన్ నుంచి బాంబు బెదిరింపు కాల్ వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. చివరికి బాంబు లేదని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా నగరంలో వరుస బాంబు బెదిరింపులు రావడంతో అధికారులు, ప్రజలు ఆందోళన చెందారు. బెదిరింపు కాల్ చేసిన వ్యక్తి కోసం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.