Road Accident in Narayanapet: నారాయణపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం.. పలువురికి గాయాలు
Road Accident in Narayanapet: నారాయణపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో 10 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. మక్తల్ మండలం బొందల్ కుంట- జక్లేర్ గ్రామల సమీపంలో 167వ హైవేపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఘటనలో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఏడుగురిని రాయచూర్ కి, మిగిలిన వారిని మహబూబ్ నగర్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి ట్రావెల్ బస్సు డ్రైవర్ అతివేగమే కారణమని ప్రయాణికులు ఆరోపించారు. ప్రమాదం అనంతరం హైవేపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో ట్రాఫిక్ పోలీసులు అక్కడికి చేరుకుని వాహనాల రాకపోకలు క్లియర్ చేశారు.
క్షతగాత్రులను మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటన జరిగిన సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. బస్సు కర్ణాటకలోని శివమొగ్గ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఘటనాస్థలిలో పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.