TGSRTC : ‘మహాలక్ష్మి’కి ఆధార్ ఒక్కటే ప్రామాణికం కాదు : ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్

TGSRTC : శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని హామీనిచ్చింది. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ పథకాలను అమలు చేస్తోంది. దీనిలో భాగంగా మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణం కల్పిస్తోంది. బస్సుల్లో కండక్టర్లు వివిధ కండీషన్లు పెడుతున్నారు. దీంతో కండక్టర్లు మహిళలకు గొడవలు జరుగుతున్నాయి. సీట్ల కోసం మహిళలు కొట్టుకుంటున్నారు. దీంతో మహాలక్ష్మి పథకంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తెలంగాణకు చెందిన మహిళలు ఆధార్ కార్డు చూపిస్తే కండక్టర్లు జీరో టికెట్ జారీ చేసి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్లు అప్డేట్ చేయించిన ఆధార్ కార్డు చూపిస్తేనే జీరో టికెట్లు జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ ప్రయాణికుడు ఇదే విషయంపై ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ను ప్రశ్నించారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు జీరో టికెట్ కోసం ఆధార్ కార్డు ఉండాలా? కచ్చితంగా అప్డేట్ ఆధార్ కార్డు కావాలా..? దయచేసి నిర్ధారించాలని సజ్జనార్ను ప్రయాణికుడు కోరారు.
దీనిపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఒరిజినల్ ఆధార్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ తదితర గుర్తింపు కార్డులు కండక్టర్లకు చూపించి జీరో టికెట్లు తీసుకోవాలని సూచించారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత రవాణా సదుపాయం స్కీం అమలుకు ఆధార్ కార్డు ఒకటే ప్రామాణికం కాదని సజ్జనార్ స్పష్టం చేశారు.