Yusuf Pathan: పాక్ పై దౌత్య యుద్దానికి రాలేనన్న యూసూఫ్ పఠాన్

Yusuf Pathan on Pahalgam Attack: పాకిస్తాన్ ఉగ్ర చర్యలను అంతర్జాతీయ వేదికలపై ఎండగట్టేందుకు కేంద్ర ప్రభుత్వం బృందాలను ఏర్పాటు చేసింది. అందులో టీమిండియా మాజీ క్రికెటర్, టీఎంసీ ఎంపీ యూసూఫ్ పఠాన్ పేరును చేర్చారు. అయితే తమ అనుమతి లేనిదే మా ఎంపీ పేరును ఎలా ఫైనల్ చేస్తారని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేసింది. టీఎంసీ పార్టీని సంప్రదించకుండా యూసూఫ్ పఠాన్ ఎంపిక జరిగిందన్నారు ఆపార్టీ నేత అభిషేక్ బెనర్జీ. ఒక పార్టీ ఎంపీని ఎంపిక చేసేటప్పుడు ఆపార్టీతో కేంద్రం చర్చించాలని అన్నారు. ఆపై తమ ఎంపీ అయిన యూసూఫ్ పఠాన్ దౌత్య పర్యటనకు వెళ్లడని స్పష్టం చేశారు. యూసూఫ్ పఠాన్ కూడా తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.
కాంగ్రెస్ పార్టీనుంచి సీనియర్ ఎంపీ శశిథరూర్ ఆధ్వర్యంలో టీం ను ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇందులో తమిళనాడు నుంచి డీఎంకే పార్టీకి చెందిన కనిమొళి, మహారాష్ట్ర నుంచి ఎన్సీపీనుంచి సుప్రియా సులే, శివసేన నుంచి ఏక్ నాథ్ షిండే, జేడీయూ నుంచి సంజయ్ కుమార్, బీజేపీ నుంచి రవి శంకర్ ప్రసాద్ ఉన్నారు.
పహల్గాం దాడికి ప్రతిగా భారత్ చేసిన ఆపరేషన్ సిందూర్ లో హతమైన ఉగ్రవాదులను పాకిస్తాన్ ఆర్మీ దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించింది. ఆపై పాకిస్తాన్ ఆర్మీ అధికారులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ భారత్ పై గతంలో జరిగిన ఉగ్రదాడులు పాక్ సైన్యానికి చెందిన విజయాలుగా అభివర్ణించారు. ఆర్మీ ట్రైనింగ్ లో జిహాద్ ఒక భాగమని నోరుజారారు. ఈ విషయాలన్నింటిపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది.
పాకిస్తాన్ నిజ స్వరూపాన్ని ప్రపంచ దేశాలకు తెలియజేసేందుకు కేంద్రం ఆయా పార్టీలకు చెందిన ఎంపీలను ఎంపిక చేసింది. అందులో అన్ని పార్టీలు, మతాల ఎంపీలు ఉండేవిధంగా టీంను తయారు చేసింది. అందులో భాగంగానే యూసూఫ్ పఠాన్ ను ఎంపిక చేస్తే అతను తప్పుకున్నాడు. 51మంది ఎంపికైన నేతలు 7 బృందాలుగా విదేశాల్లో పాక్ వైకరిని ఎండగట్టనున్నారు.