Published On:

Rajnath: పాక్ ఐఎంఎఫ్ ఫండ్స్ పక్కదారి పట్టిస్తోంది.. రక్షణ మంత్రి రాజ్ నాథ్ కామెంట్స్

Rajnath: పాక్ ఐఎంఎఫ్ ఫండ్స్ పక్కదారి పట్టిస్తోంది.. రక్షణ మంత్రి రాజ్ నాథ్ కామెంట్స్

Pakistan: రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఇవాళ భుజ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ను సందర్శించారు. ఆపరేషన్ సిందూర్ గురించి మాట్లాడారు. కాగా పహల్గామ్ ఉగ్రదాడిలో లష్కరే తోయిబాకు చెందిన ముష్కరులు 26 మంది పర్యాటకులను కాల్చి చంపారు. ఈ ఘటనకు ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్ లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా దాడులు జరిపింది. ఉగ్రస్థావరాలను నేలమట్టం చేయడంతో దాడుల్లో 100 మంది ముష్కరులు హతమయ్యారు. అయితే భారత్ జరిపిన దాడులకు ప్రతీకారంగా పాకిస్తాన్ డ్రోన్లు, మిస్సైళ్లతో భారత్ పై దాడులు ప్రారంభించింది. వాటిని భారత రక్షణ వ్యవస్థ ధీటుగా ఎదుర్కొంది. చివరికి భారత్ ముందు నిలవలేక కాల్పుల విరమణ అంటూ కాళ్లబేరానికి వచ్చింది.

 

అయితే దాడులు ఆగిన ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ భుజ్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారతీయ మిలిటరీ నిర్వహించిన పాత్రను దేశంలోనే కాకుండా, విదేశాల్లో కూడా ప్రశంసలు వస్తున్నట్టు చెప్పారు. ఉగ్రవాదంపై మన వైమానిక దళం తన ఆపరేషన్ ను ప్రభావవంతంగా నిర్వహించిందన్నారు.

 

పాకిస్తాన్ లోని అన్ని ప్రాంతాలకు వెళ్లే సామర్థ్యం భారత వైమానిక దళానికి ఉందని, ఇది చిన్న విషయం కాదన్నారు. ఆపరేషన్ సిందూర్ తో భారత్ సత్తా బయటపడిందన్నారు. పాకిస్తాన్ లోని 9 ఉగ్రవాద కేంద్రాలను భారత మిలిటరీ ధ్వంసం చేసిన దృశ్యాలను ప్రపంచం తిలకించిందన్నారు. అలాగే పాకిస్తాన్ కు చెందిన అనేక ఎయిర్ బేస్ లు ధ్వంసమైనట్టు చెప్పారు. బ్రహ్మోస్ ధాటికి తట్టుకోలేక పాకిస్తాన్ ఒణికిపోయిందన్నారు. భారత్ లో తయారైన ఆయుధాలు.. ఆపరేషన్ సిందూర్ టైంలో మిలిటరీ శక్తిగా మారిందని తెలిపారు. ధ్వంసమైన ఉగ్రవాద స్థావరాలను తిరిగి నిర్మించే పనిలో పాకిస్తాన్ ఉందన్నారు. అందుకే ప్రస్తుత తరుణంలో పాకిస్తాన్ కు ఎలాంటి ఆర్థిక సాయం చేసినా.. అది టెర్రర్ ఫండింగ్ తో సమానమే అని పేర్కొన్నారు.

 

కాగా పాకిస్తాన్ కు బిలియన్ డాలర్లు ఇచ్చిన అంశంపై ఐఎంఎఫ్ మళ్లీ ఆలోచనలో పడిపోయిందని తాను భావిస్తున్నట్టు మంత్రి రాజ్ నాథ్ అన్నారు. ఐఎంఎఫ్ కు తాము ఇచ్చిన నిధులను పాకిస్తాన్ కు ఇవ్వొద్దు అని, ఎందుకంటే ఆ నిధులను పాకిస్తాన్ ఉగ్రవాదుల అభివృద్ధికి వాడుకుంటుందని ఆరోపించారు. ఆపరేషన్ సిందూర్ ముగియలేదని, ప్రస్తుతం ట్రైలర్ మాత్రమే చూశారని, అసలు సినిమా ముందుందన్నారు.