Bhatti Vikramarka : కేంద్రం కులగణనపై తీసుకున్న నిర్ణయం తెలంగాణ ప్రభుత్వ విజయం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Deputy CM Bhatti Vikramarka : కేంద్రం కులగణనపై తీసుకున్న నిర్ణయం తెలంగాణ సర్కారు విజయానికి నిదర్శనమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లాలోని మల్లన్నపాలెంలో రామలింగేశ్వర స్వామి దేవస్థానం పునర్నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదటిగా కులగణన చేపట్టి ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. ప్రజల అభివృద్ధిని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని కులగణనను చేపట్టిందన్నారు. కులగణన సర్వే ఫలితాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు..
కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు రాజకీయ, విద్య, ఉద్యోగ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన విషయాన్ని గుర్తుచేశారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సందర్భంగా దేశ వ్యాప్తంగా కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారని తెలిపారు. కానీ, కేంద్రం అప్పుడు స్పందించలేదన్నారు. ఇప్పుడు ప్రజల ఒత్తిడికి తలొగ్గి కులగణన చేపట్టేందుకు ఒప్పుకున్నట్లు తెలిపారు. ఇన్నేండ్లు తెలంగాణలో జరిగిన కులగణనను విమర్శించిన బీజేపీ ఇప్పుడు అదే మార్గాన్ని అనుసరించడాన్ని సానుకూల పరిణామంగా అభివర్ణించారు. తెలంగాణలోని బీసీలు ప్రభుత్వానికి అండగా నిలవాలని భట్టి పిలుపునిచ్చారు.