Hyderabad: సిటీలో మరో ఫ్లైఓవర్.. రెడీ అవుతున్న అధికారులు

GHMC: హైదరాబాద్ నగరంలో మరో భారీ ఫ్లై ఓవర్ నిర్మించేందుకు జీహెచ్ఎంసీ కార్యచరణ మొదలుపెట్టింది. అందులో భాగంగా గచ్చిబౌలి రాడిసన్ బ్లూ హోటల్ నుంచి డీఎల్ఎఫ్ మీదుగా కిలోమీటర్ మేర ఫ్లైఓవర్ నిర్మించేందుకు జీహెచ్ఎంసీ ప్లాన్ చేస్తోంది. ఈ ఫ్లైఓవర్ ను మూడు లైన్లలో నిర్మించాలని భావిస్తుండగా ఒక చోట అండర్ పాస్ నిర్మించేందుకు కూడా అధికారులు ప్రణాళికలు వేస్తున్నారు. కాగా ఫ్లైఓవర్ నిర్మాణానికి రూ. 150 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా.
అయితే ఈ ఫ్లై ఓవర్ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడంతో బల్దియా అధికారులు కసరత్తు ప్రారంభించారు. చెన్నైకి చెందిన ఓ కన్సల్టెన్సీ కంపెనీకి బాధ్యతలు అప్పగించారు. మరో 15 రోజుల్లో కన్సల్టెన్సీ ప్రతినిధులు రిపోర్టు అందించనున్నారు. నివేదిక ఆధారంగా అధికారులు టెండర్లు పిలవనున్నారు. ఈ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి అయితే హైటెక్ సిటీ, కొండాపూర్, కొత్తగూడ మీదుగా వచ్చే వాహనాలు నానక్ రాంగూడ, లింగంపల్లి వైపు త్వరగా వెళ్లొచ్చు.
అలాగే హైదరాబాద్ లో అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. అందులో భాగంగా రూ. 7032 కోట్ల ఖర్చుతో 58 పనులు చేపట్టనున్నారు. ఇందులో 28 ఫ్లై ఓవర్లు, 13 అండర్ పాస్ లు, 4 ఆర్వోబీలు, 3 అండర్ బ్రిడ్జీలు, 10 రోడ్డు విస్తరణ పనులు చేపట్టేందుకు ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అందులో కొన్ని టెండర్ల దశలో ఉండగా, మరికొన్ని ఒప్పందాలు చేసుకునే దశలో ఉన్నాయి. ఇందులో కొన్ని పనులు మరికొద్ది రోజుల్లో మొదలు కానున్నాయి.