Tirumala Darshan: తిరుమలకు వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్.. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు

Tirumala Tirupati Devasthanam: వేసవి సెలవులతోపాటు, వీకెండ్ కావడంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. విద్యాసంస్థల సెలవులు దగ్గర పడుతుండటంతో శ్రీవారిని దర్శించుకునేందుకు పెద్దఎత్తున తిరుమల చేరుకుంటున్నారు. మూడు రోజులుగా తిరుపతి కొండపై భక్తులు కిటకిటలాడుతున్నారు. శనివారం ఉదయం నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. ఇవాళ కూడా రద్దీ కొనసాగుతోంది. ఆదివారం తెల్లవారుజామున శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో క్యూలైన్లలో ఉన్నారు. కంపార్ట్మెంట్లన్నీ నిండి బయట క్యూలైన్లలో వేచిఉన్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. శనివారం రోజున శ్రీవారిని 90,211 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.11 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
టీటీడీ మరో కీలక నిర్ణయం..
తిరుమల దేవస్థానం ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. శ్రీవారిని దర్శించుకునేందుకు దేశవిదేశాల నుంచి భక్తులు, ప్రముఖులు వస్తుంటారు. అలాంటి వారి కోసం టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి సేవలో పాల్గొనేందుకు ఎన్ఆర్ఐలకు అవకాశం కల్పించాలని నిర్ణయించారు. స్వామివారి సేవకు 14 దేశాల్లోని ఎన్ఆర్ఐలు ఆసక్తి కలిగి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఔత్సాహికులతో టీటీడీ ఈవో వీడియో సమావేశం నిర్వహించారు. త్వరలో ఎన్ఆర్ఐలకు ఈ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.