Pawan Kalyan: విశాఖ రైల్వే జోన్.. ప్రధానికి పవన్ కృతజ్ఞతలు

South Coast Railway: ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న విధంగా విశాఖ కేంద్రంగా ఏపీకి రైల్వేజోన్ ను కేంద్రం ప్రకటించింది. దక్షిణ మధ్య రైల్వేలోని విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లు, ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ లోని వాల్తేరు డివిజన్ ను కలిపి విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కాగా రైల్వే జోన్ పనులను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తోంది. ఈ నేపథ్యంలోనే సౌత్ కోస్ట్ రైల్వే జోన్ లో కీలక అడుగు పడింది. కొత్తగా ఏర్పాటు చేసిన రైల్వే జోన్ కు జీఎంను నియమించింది. సందీప్ మాధుర్ ను ఆ పోస్టుకు ఖారారు చేసింది. ఈమేరకు నిన్న ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇప్పటివరకు ఆయన ఢిల్లీ రైల్వే సిగ్నల్ ఆధునికీకరణ ప్రాజెక్ట్ హెడ్ గా ఉన్నారు.
కాగా విశాఖ కేంద్రంగా ఉన్న సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కు కొత్త జీఎంను నియమించడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఎక్స్ వేదికగా స్వాగతించారు. అందుకు సహకరించిన ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులకు కృతజ్ఞతలు చెప్పారు. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కు జీఎం నియమించడం వల్ల రైల్వే కార్యకలాపాలకు నూతన దిశలో వేగవంతమైన పురోగతి వస్తుందని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు కేంద్ర నిర్ణయం అర్థం చెబుతోందని.. ఎన్డీఏ ప్రభుత్వం చొరవతో సౌత్ కోస్ట్ రైల్వే అభివృద్ధిలో ఇది కీలక పరిణామం అన్నారు. ఏపీ ప్రజల దీర్ఘకాల కోరికకు ఈ నిర్ణయం న్యాయం చేస్తుందన్నారు. అలాగే రైల్వేజోన్ కు జీఎంగా నియమితులైన సందీప్ మథూర్ కు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు చెప్పారు.