Srisailam Reservoir: ఏపీలో భారీ వర్షాలు.. శ్రీశైలం రిజర్వాయర్ కు వరద!

Srisailam Reservoir: తెలుగు రాష్ట్రాలపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా ఏపీలోని పలు జిల్లాలో ద్రోణి, అల్పపీడనం ప్రభావం ఎక్కువగా ఉంది. దీంతో భారీ వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఎడతెరిపిలేని వర్షాలు ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాలకు ఆయా జిల్లల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో చెరువులు, కుంటల్లోకి వరద రాక ప్రారంభమైంది.
ఇక కర్నూలు జిల్లాలోని ప్రాజెక్టులకు కూడా వరద వస్తోంది. అలాగే ఎగువన కర్నాటకలోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. అరేబియా సముద్రంలో ఏర్పడిన తుపాను కారణంగా కర్నాటక, మహారాష్ట్ర, గోవా, కేరళ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడుతుంది. ఇక కర్నాటకలో కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర నదికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో కోసిగి మండలం ఆర్డీఎస్ వద్ద వరద ఉధృతి పెరిగింది.
సుంకేసుల డ్యామ్ కు భారీగా వరద వస్తుండటంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ముందు జాగ్రత్తగా ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో శ్రీశైలం ప్రాజెక్టుకు వరద వస్తోంది. మరోవైపు కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో కూడా వర్షాలు కురవడంతో శ్రీశైలం రిజర్వాయర్ కు వరద వస్తోంది. ప్రస్తుతం జలాశయానికి 21,666 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తున్నట్టు అధికారులు తెలిపారు. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం నీటిమట్టం 816.70 అడుగుల వద్ద ఉంది.