Thummala : ఈటల అన్నీ అబద్ధాలు చెప్పారు : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

Agriculture Minister Tummala Nageswara Rao : కాళేశ్వరం వివాదంలోకి తనను కావాలని లాగుతున్నారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కాళేశ్వరం కమిషన్ ఎదుట బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అబద్ధాలు చెప్పారని పేర్కొన్నారు. సబ్ కమిటీకి, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధంలేదన్నారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట ఇచ్చిన వాంగ్మూలం అసత్యాలతో కూడుకొని ఉందన్నారు. ఈటల అన్నీ అబద్ధాలు చెప్పారన్నారు. ఈటల ఇచ్చిన సమాధానాలు వాస్తవ దూరంగా ఉన్నాయన్నారు. వాంగ్మూలం ఈటల అనాలోచితంగా ఇచ్చారా? లేకపోతే ఆ రకంగా ఇవ్వాల్సిన పరిస్థితులు ఆయనకు ఏమైనా దాపురించాయా అని కౌంటర్ ఇచ్చారు. శనివారం సచివాలయంలో మంత్రి తుమ్మల మీడియాతో మాట్లాడారు.
కాళేశ్వరం వివాదంలోకి తనను లాగుతున్నారని, తప్పుడు ప్రకటనలతో ఎక్కువ రోజులు మభ్యపెట్టలేరని మండిపడ్డారు. ఈటల సబ్ కమిటీ అంశాన్ని ప్రస్తావించారని, సబ్ కమిటీ కాళేశ్వరం నిర్మాణం కోసం వేసింది కాదన్నారు. మేడిగడ్డ బ్యారేజీకి అనుమతులు ఇచ్చిన తర్వాత 15 రోజులకు రాష్ట్రంలో ఉన్న ఆన్ గోయింగ్ ప్రాజెక్టులపై సబ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పెండింగ్ ప్రాజెక్టులు ఎస్టిమేషన్ ధరలకే కాంట్రాక్టర్లు పనులు పూర్తిచేస్తారా? పనులు చేస్తే ఏం చేయాలి? చేయకుంటే సర్కారు ఏం నిర్ణయం తీసుకోవాలని అనే అంశంపై సబ్ కమిటీ వేశారన్నారు. కమిటీ కాళేశ్వరం నిర్మాణానికి అనుమతి ఇవ్వలేదని ప్రాజెక్టుపై సబ్ కమిటీ ఎప్పుడూ నివేదిక ఇవ్వలేదన్నారు. కేబినెట్ అఫ్రూవల్కు కాళేశ్వరం ప్రాజెక్టు ఎప్పుడు రాలేదని ఇది కేబినెట్ అప్రూవల్ పొందలేదని స్పష్టం చేశారు. కాళేశ్వరం నిర్మాణానికి తనకు సంబంధం లేదని, తను సుమోటోగా జస్టిస్ పీసీ కమిషన్ ముందుకు వెళ్తానని, కమిషన్ దృష్టికి వివరాలను తీసుకువెళ్తానని స్పష్టం చేశారు.