AP Secretariat : ఏపీ సచివాలయంలో ఉద్యోగాల పేరుతో రూ.53 లక్షలు టోకరా.. నిందితుల అరెస్టు

AP Crime : ఏపీ సచివాలయంలో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి 7మంది నిరుద్యోగుల నుంచి రూ.53 లక్షలు వసూలు చేసిన ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్లను సృష్టించి నిందితులు రూ.53 లక్షలు కాజేశారు. నలుగురు నిందితులను ఒకటో పట్టణం పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.6 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను విజయనగరం డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు శనివారం మీడియాకు వెల్లడించారు.
విజయనగరం జిల్లా కేంద్రంలోని ప్రదీప్నగర్కు చెందిన నిందితుడు కె.సాయి వెంకట్ సుజిత్ ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని ఫేస్బుక్లో పోస్టు పెట్టాడు. ఆసక్తి ఉన్నవారు తనను సంప్రదించాలని కోరాడు. పోస్టును చూసిన విజయనగరం, విశాఖ, పార్వతీపురం మన్యం, అనకాపల్లి ప్రాంతాలకు చెందిన 7మంది నిరుద్యోగ యువకులు సుజీత్ను సంప్రదించారు. విజయవాడలోని సచివాలయంలో పలు ప్రభుత్వ విభాగాల్లో ఔట్సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాలు వేయిస్తామని చెప్పి వారి నుంచి రూ.53 లక్షలు తీసుకొని మోసం చేశాడు. నకిలీ అపాయింట్మొంట్ ఆర్డర్లు సృష్టించి వారికి అందించారు.
7మంది బాధితులను విజయవాడ తీసుకొచ్చి నెల రోజులపాటు అక్కడే ఉంచారు. తొందరలోనే సమచారం ఇస్తామని చెప్పి వారిని వెళ్లి పొమ్మన్నారు. ఎలాంటి సమాచారం రాకపోవడంతో బాధితుడు ఎస్.కోటకు చెందిన ఎస్.వినోద్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. సీఐ ఎస్.శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల్లో ఐదుగురు ఏపీ వాసులు, నలుగురు హైదరాబాద్కు చెందిన వారీగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు విషయం తెలియగానే నిందితులు పరారయ్యారు.
పట్టుబడిందిలా..
ముఠాలో కీలక నిందితుడు సాయి వెంకట్ సుజిత్కు ఆరోగ్యం బాగోలేదని చూసేందుకు మిగతా నిందితులు సీహెచ్ మహేశ్, రూబిన్ కుమార్, జాన్, యాకూబ్ విజయనగరం వస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే పోలీసులు రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో మాటువేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు నేరం చేసినట్లు అంగీకరించారు. హైదరాబాద్లో నకిలీ ఐడీ కార్డులు, అపాయింట్మెంట్ ఆర్డర్లు తయారు చేసినట్లు విచారణలో తేలింది. పరారీలో ఉన్న మిగిలిన నిందితులను త్వరలో పట్టుకుంటామని డీఎస్పీ తెలిపారు. ప్రధాన నిందితుడు సుజిత్ కోలుకోగానే అరెస్టు చేస్తామన్నారు. ఈ సందర్భంగా కేసు ఛేదించిన సీఐ శ్రీనివాస్, ఎస్సై ప్రసన్నకుమార్, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.