UPSC IFS 2024 Results: యూపీఎస్సీ ఐఎఫ్ఎస్ ఫలితాలు విడుదల.. తెలుగు అభ్యర్థుల సత్తా..!

UPSC IFS 2024 Results Released: యూపీఎస్సీ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) ఫలితాలు నిన్న విడుదలయ్యాయి. ఈమేరకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక వెబ్ సైట్లో ఫలితాలను ఉంచారు. మొత్తం 150 పోస్టుల భర్తీకి గతేడాది జూన్ 16న యూపీఎస్సీ ఐఎఫ్ఎస్ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. అనంతరం నవంబర్ 24 నుంచి డిసెంబర్ 1 వరకు మెయిన్స్ పరీక్షలు జరిగాయి. తర్వాత ఏప్రిల్ 21 నుంచి మే 2 వరకు పర్సనాలిటీ టెస్టులు నిర్వహించారు. తుది ఫలితాలను నిన్న విడుదల చేశారు. ఫలితాల్లో 143 మందిని ఎంపిక చేశారు. ఫలితాల్లో 40 మంది జనరల్ కేటగిరి అభ్యర్థులు కాగా.. 19 మంది ఈడబ్ల్యూఎస్, 50 మంది ఓబీసీ, 23 మంది ఎస్సీ, 11 మంది ఎస్టీ కేటగిరీలో సెలక్ట్ అయ్యారు అభ్యర్థుల మార్కులను 15 రోజుల్లో అందుబాటులో ఉంచుతామని యూపీఎస్సీ ప్రకటించింది.
ఇక జాతీయ స్థాయిలో యూపీఎస్సీ (ఐఎఫ్ఎస్) పోస్టులకు నిర్వహించిన పరీక్షలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 10 మందికిపైగా అభ్యర్థలు టాప్ ప్లేస్ లో నిలిచారు. ఇందులో నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన చాడ నిఖిల్ రెడ్డి 11వ ర్యాంక్ సాధించారు. యెదుగూరి ఐశ్వర్యారెడ్డి 13వ ర్యాంకు, జి. ప్రశాంత్ 25వ ర్యాంక్, చెరుకు అవినాశ్ రెడ్డి 40వ ర్యాంక్, చింతకాయల లవకుమార్ 49వ ర్యాంక్, అట్ల తరుణ్ తేజ 53వ ర్యాంక్, ఆలపాటి గోపీనాథ్ 55వ ర్యాంక్, కె. ఉదయ్ కుమార్ 77వ ర్యాంక్, టీఎస్. శిశిర 87వ ర్యాంక్ సాధించారు.