Stiff Neck Pain: 60% యువతలో టెక్స్ట్ నెక్ సిండ్రోమ్.. కారణాలివేనట !

Stiff Neck Pain: ప్రస్తుతం అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా.. అనేక ఆరోగ్య సమస్యల ప్రమాదం వేగంగా పెరుగుతోంది. యువతలో టెక్స్ట్ నెక్ అనేది ప్రస్తుతం ఎదుర్కుంటున్న వాటిలో ప్రధాన సమస్య. దాదాపు 60% మంది యువత ఈ సమస్యతో బాధపడుతున్నారని పరిశోధనల్లో రుజువైంది.
టెక్స్ట్ నెక్ సిండ్రోమ్ అనేది స్మార్ట్ఫోన్ను ఎక్కువ ఉపయోగించడం వల్ల కలిగే సమస్య. మొబైల్ ఫోన్ వాడటం లేదా అదే పనిగా రీల్స్ చూడటం లేదా ఎక్కువసేపు మెడను వంచడం వల్ల మెడలో నొప్పి , దృఢత్వం పెరుగుతుంది. కొన్ని సందర్భాల్లో.. ఈ సమస్య చాలా ఇబ్బందిగా ఉంటుంది. దీని కారణంగా మీ రోజువారీ పనులు కూడా చేసుకోవడం కూడా కష్టమవుతుంది.
మొబైల్ చూస్తూ ఉండటం ప్రమాదకరం:
15-20 సంవత్సరాల వయస్సు గల వారిలో ఈ ప్రమాదం పెరుగుతోంది. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ (IJHSR) నివేదిక ప్రకారం.. 15-20 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులు ఈ రకమైన మెడ సమస్యకు ఎక్కువగా గురవుతారు.
పశ్చిమ ఆఫ్రికాలోని బెనిన్లో 1835 మంది విద్యార్థులపై నిర్వహించిన ఒక అధ్యయనంలో 74.55% మంది మొబైల్ ఫోన్ ఎక్కువగా ఉపయోగించారు. కాలక్రమేణా వారిలో 1,000 కంటే ఎక్కువ మంది మెడ నొప్పి సమస్యను ఎదుర్కున్నారు. గంటలో నాలుగు నుంచి ఐదు సార్లు స్మార్ట్ఫోన్ను ఉపయోగించిన వారిలో ఈ ప్రమాదం ఎక్కువగా ఉందని నివేధికలో పేర్కొన్నారు.
టెక్స్ట్ నెక్ కి కారణాలు:
ఆధునిక యుగంలో టెక్స్ట్ నెక్ ఒక సాధారణ ఆరోగ్య సమస్య అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మీ మెడ , వెన్నెముకను వంచి, ఎక్కువసేపు స్క్రీన్ను చూడటం వల్ల ఈ ప్రమాదం తలెత్తుతుంది. దీనివల్ల కండరాలు, ఎముకలపై ఒత్తిడి పెరుగుతుంది.
మనం తలను వంచినప్పుడు, మెడ వంగిన భాగంపై భారం పెరుగుతుంది. సాధారణంగా తల బరువు 4.5-5.5 కిలోలు ఉంటుంది. కానీ దానిని 60 డిగ్రీలు వంచి ఉన్నప్పుడు, మెడ వంపు వద్ద 25 కిలోల వరకు బరువు ఉంటుంది. ఈ విధంగా.. ఇది మెడ నొప్పి , కండరాల సమస్యలను పెంచుతుంది.
టెక్స్ట్ నెక్ వచ్చే ప్రమాదం ఎవరికి ఎక్కువగా ఉంటుంది ?
మొబైల్, టాబ్లెట్లను అధికంగా ఉపయోగించే వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.
2020 అధ్యయనం ప్రకారం.. రోజుకు సగటున 3–5 గంటలు మొబైల్లో గడిపే 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు గల యువకులు టెక్స్ట్ నెక్తో బాధపడే అవకాశం ఉంది.
ల్యాప్టాప్ లేదా కంప్యూటర్పై వంగి నిరంతరం పనిచేసే ఉద్యోగులు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటారు. తల ఎంత ఎక్కువగా వంగి ఉంటే.. మెడపై అంత ఎక్కువ ఒత్తిడి పడుతుంది.
ఇలాంటి సమస్యలను నివారించడానికి, మొబైల్ లేదా ల్యాప్టాప్ స్క్రీన్ను కళ్ళకు సమాంతరంగా ఉంచడం అలవాటు చేసుకోండి. మీరు ఆఫీసులో పనిచేస్తుంటే, ప్రతి 20 నిమిషాలకు విరామం తీసుకోండి.