South Central Railway: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. జూన్ 1 నుంచి స్పెషల్ ట్రైన్స్!

South Central Railway: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వేసవి సెలవులు నడుస్తున్నాయి. స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఉండటం, పెళ్లిళ్ల సీజన్ కావడంతో విహారయాత్రలు, తీర్థయాత్రలు, పర్యాటక ప్రదేశాలకు వెళ్లే వారి సంఖ్య భారీగా పెరిగిపోయింది. దీంతో రైళ్లలో రద్దీ నెలకొంది. రెగ్యులర్ గా తిరిగే రైళ్లు ప్రయాణికుల రద్దీకి ఏమాత్రం సరిపోవడం లేదు. దీంతో స్పెషల్ ట్రైన్స్ నడిపించాలని ప్రయాణికుల నుంచి పెద్దఎత్తున్న డిమాండ్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సౌత్ సెంట్రల్ రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది.
ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా స్పెషల్ ట్రైన్స్ నడిపిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు, విశాఖపట్నం, తిరుపతి ప్రాంతాలకు 44 ప్రత్యేక రైళ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉంచుతున్నట్టు తెలిపారు. ఈ స్పెషల్ ట్రైన్స్ జూన్ 1 నుంచి జూలై 26 వరకు రాకపోకలు సాగిస్తాయని చెప్పారు.
రైలు నెంబర్- 08581 విశాఖపట్నం- ఎస్ఎంవీటీ బెంగళూరు మధ్య జూన్ 1 నుంచి జూన్ 29 వరకు ప్రతి ఆదివారం ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. ఇక రైలు నెంబర్- 08582 ఎస్ఎంవీటీ బెంగళూరు- విశాఖపట్నం మధ్య జూన్ 2 నుంచి జూన్ 30 వరకు ప్రతి సోమవారం ప్రత్యేక రైలు అందుబాటులో ఉండనుంది. ఈ రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచిలి, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు రేణిగుంట, జోలార్ పెట్టై, కుప్పం, బంగార్ పేట, కృష్ణరాజపురం స్టేషన్లలో ఆగుతాయి.
రైలు నెంబర్- 08547 విశాఖపట్నం- తిరుపతి మధ్య జూన్ 4 నుంచి జులై 30 వరకు ప్రతి బుధవారం రైలు అందుబాటులో ఉండనుంది. అలాగే రైలు నెంబర్- 08548 తిరుపతి- విశాఖపట్నం మధ్య జూన్ 5 నుంచి జులై 32 వరకు ప్రతి గురువారం రైలు అందుబాటులో ఉండనుంది. ఈ రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచిలి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తణుకు, భీమవరం టౌన్, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి, రేణిగుంట స్టేషన్లలో ఆగుతాయి.
రైలు నెంబర్ 08579 విశాఖపట్నం- చర్లపల్లి మధ్య జూన్ 6 నుంచి జులై 25 వరకు ప్రతి శుక్రవారం ప్రత్యేక రైలు అందుబాటులో ఉండనుంది. అలాగే రైలు నెంబర్ 08580 చర్లపల్లి- విశాఖపట్నం మధ్య జూన్ 7 నుంచి జులై 26 వరకు ప్రతి శనివారం ప్రత్యేక రైలు నడవనుంది. ఈ రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచిలి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లలో ఆగుతాయి.