Rohit Sharma: టెస్ట్ క్రికెట్ కు రోహిత్ శర్మ గుడ్ బై.. షాక్ లో ఫ్యాన్స్

Cricket: టీమిండియా టెస్ట్ క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మ సంచలన నిర్ణయం తీసుకున్నారు. టెస్ట్ క్రికెట్ నుంచి తాను రిటైర్ అవుతున్నానని ప్రకటించారు. ఈ మేరకు తన ఇన్ స్టా అకౌంట్ లో పోస్ట్ చేశారు. అయితే వన్డే క్రికెట్ మాత్రం తాను కొనసాగుతానని వెల్లడించారు. రోహిత్ శర్మ తీసుకున్న నిర్ణయంతో క్రికెట్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.
కాగా ఇప్పటికే టీ20ల నుంచి వైదొలిగిన రోహిత్ శర్మ.. తాజాగా టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నానని చెప్పారు. కాగా రోహిత్ శర్మ తన టెస్ట్ క్రికెట్ కెరీర్ లో 67 మ్యాచ్ లు ఆడారు. అందులో 12 సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టెస్ట్ ఫార్మట్ లో మొత్తం 4301 పరుగులు చేశారు. 2013లో టెస్ట్ క్రికెట్ లోకి అడుగుపెట్టిన రోహిత్ 12 ఏళ్లపాటు కొనసాగారు. చివరిసారిగా గతేడాది ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ ఆడారు. సిరీస్ లో టీమిండియా 3-1 తేడాతో ఘోరంగా ఓడిపోవడంతో రోహిత్ శర్మపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆ సమయంలోనే రోహిత్ తన టెస్ట్ క్రికెట్ ఫార్మట్ కు రిటైర్మెంట్ ఇస్తారని అంతా అనుకున్నారు. కానీ ఐపీఎల్ సీజన్ లో సంచలన నిర్ణయం తీసుకున్నారు.
త్వరలో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనున్న టీమిండియా.. రోహిత్ శర్మ తీసుకున్న నిర్ణయంతో అయోమయంలో పడిపోయింది. ప్రస్తుతం జట్టుకు ఎవరు ప్రాతినిధ్యం వహించాలా అని బీసీసీఐ ఆలోచిస్తోంది. అయితే టెస్ట్ క్రికెట్ కెప్టెన్ గా బుమ్రా, శుభ్ మన్ గిల్, రిషబ్ పంత్ పోటీలో ఉన్నట్టు సమాచారం.
తాను టెస్ట్ ఫార్మట్ నుంచి తప్పుకుంటున్నట్టు రోహిత్ శర్మ ఓ పోస్ట్ చేశారు. “అందులో అందరికీ నమస్కారం.. నేను టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నాను. వైట్ జెర్సీలో నా దేశం తరపున ఆడటం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. ఇన్నాళ్లుగా నాపై మీరంతా చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు.. కానీ వన్డే క్రికెట్ నుంచి మాత్రం టీమిండియాకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటాను” అని చెప్పుకొచ్చారు.