Iran – Israel War Effect: భగ్గుమన్న పశ్చిమాసియా.. ఇరాన్ నుంచి అర్మేనియాకు 110 మంది భారతీయ విద్యార్థులు

Israeli attack on Iran’s Nuclear Facilities: పశ్చిమాసియా మరోసారి భగ్గుమంది. గతవారం ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ పేరిట దాడులు ప్రారంభించగా, రెండుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వరుసగా ఐదోరోజూ కూడా ప్రతిదాడులతో రెండుదేశాలు విరుచుకుపడుతున్నాయి. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. టెహ్రాన్లోని తమ పౌరులను స్వదేశానికి తరలించే ప్రక్రియను ప్రారంభించింది. ఇప్పటికే 110 మంది భారతీయ విద్యార్థులు ఇరాన్ను వీడి అర్మేనియాకు క్షేమంగా చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో మంగళవారం ఢిల్లీకి రానున్నట్లు విదేశాంగ శాఖ ప్రకటించింది.
మరోవైపు భారతీయులు వెంటనే టెహ్రాన్ను వీడాలని ఎంబసీ తాజాగా కీలక అడ్వైజరీ జారీ చేసింది. టెహ్రాన్లోని భారతీయులు సొంతమార్గాల్లో వీలైనంత త్వరగా నగరాన్ని వీడాలని ఆదేశించింది. సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించింది. టెహ్రాన్లో నివసిస్తున్న భారతీయ పౌరులు దేశాన్ని ఖాళీ చేసి రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని పేర్కొంది. ఈ క్రమంలోనే టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం భారతీయుల కోసం అత్యవసర హెల్ప్లైన్ను ఏర్పాటు చేసింది (+989010144557, +989128109115, +989128109109).
టెహ్రాన్ విమానాశ్రయంపై ఇజ్రాయెల్ దాడి..
మరోవైపు టెహ్రాన్ విమానాశ్రయంపై ఇజ్రాయెల్ భీకర దాడి చేసింది. దాడిలో ఇరాన్కు చెందిన రెండు F-14 యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియోను ఐడీఎఫ్ దళాలు సోషల్ మీడియా ద్వారా షేర్ చేశాయి. ఇజ్రాయెల్ విమానాలను అడ్డుకునేందుకు టెహ్రాన్ విమానాశ్రయంలో సిద్ధంగా ఉంచినట్లు పేర్కొంది. తమ దాడిలో ఫైటర్ జెట్స్ పూర్తిగా ధ్వంసమైనట్లు వెల్లడించింది.