Israeli Military Apologises to India: భారతీయులకు ఇజ్రాయెల్ క్షమాపణలు.. ఇంతకీ ఏం జరిగిందంటే..?
Israeli Military apologises to India: ఇజ్రాయెల్ – ఇరాన్ దేశాల మధ్య యుద్ధంతో పశ్చిమాసియా మళ్లీ భగ్గుమంది. టెహ్రాన్పై ఇజ్రాయెల్ శుక్రవారం భీకరస్థాయిలో విరుచుకుపడింది. ఇరాన్ కూడా అంతేస్థాయిలో ప్రతిదాడులు చేసింది. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ చేసిన ఓ పోస్టు భారతీయులను ఆగ్రహానికి గురిచేసింది. దీంతో ఐడీఎఫ్ క్షమాపణలు చెప్పింది.
టెహ్రాన్పై వైమానిక ఐడీఎఫ్ దాడులకు దిగింది. శుక్రవారం రాత్రి తమ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇరాన్కు ఇజ్రాయెల్ అంతిమ లక్ష్యం కాదని, ఇది ప్రారంభం మాత్రమేనని తెలిపింది. ఆ దేశం ప్రపంచానికి పెనుముప్పు. ఇప్పుడు తమకు మరో అవకాశం లేదని ఐడీఎఫ్ అందులో రాసుకొచ్చింది. దీన్ని ప్రతిబింబించేలా ప్రపంచ పటానికి సంబంధించిన ఓ ఫొటోను జత చేసింది. అందులో భారత మ్యాప్ను తప్పుగా చూపించింది. దీంతో వివాదాస్పదమైంది.
ఫొటోలో జమ్మూకశ్మీర్ను పాక్లోని భూభాగంగా చూపిస్తున్నట్లు ఉంది. దీంతో భారత నెటిజన్లు తీవ్రంగా మండిపడ్డారు. ఫొటోను వెంటనే డిలీట్ చేయాలని డిమాండ్ చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును ట్యాగ్ చేస్తూ పోస్టులు పెట్టారు. వెంటనే ఐడీఎఫ్ స్పందించింది. కేవలం ఇరాన్ ముప్పు పొంచి ఉన్న ప్రాంతాలను ఉదహరించడం కోసం చేసిన పోస్ట్ మాత్రమేనని తెలిపింది. అందులో ఉపయోగించిన మ్యాప్ ఫొటో దేశాల సరిహద్దులను కచ్చితంగా చూపించడంలో విఫలమైంది. తప్పిదానికి తాము క్షమాపణలు తెలియజేస్తున్నామని మరో పోస్ట్ చేసింది.
ఇరాన్-ఇజ్రాయెల్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తీవ్ర స్థాయికి చేరాయి. మొదట ఇరాన్ అణు, సైనిక స్థావరాలు, సైనిక ఉన్నతాధికారులు లక్ష్యంగా వందల క్షిపణులు, డ్రోన్లతో ఇజ్రాయెల్ దాడి చేసింది. భీకర దాడిలో మిలిటరీ నాయకత్వాన్ని, అణుశాస్త్రవేత్తలను టెహ్రాన్ కోల్పోయింది. ఆ దేశ అణుకేంద్రాల్లోని మౌలిక వసతులు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ప్రతీకార దాడులకు ఇరాన్ దిగింది. మొదట భారీ సంఖ్యలో డ్రోన్లను ఇజ్రాయెల్ పైకి పంపింది. తర్వాత శుక్రవారం రాత్రి వందల సంఖ్యలో క్షిపణులను ప్రయోగించింది. టెలి అవీవ్, జెరూసలేంలో పలుచోట్ల పేలుళ్లు జరిగాయి. ప్రస్తుతం రెండు దేశాల మధ్య దాడులు కొనసాగుతున్నాయి.