Trump : అమెరికాతో ఇరాన్ అణు ఒప్పందం కుదుర్చుకోవాలి : ట్రంప్ మరోసారి హెచ్చరిక

Iran : ఇరాన్ అణు సమస్యను దౌత్య మార్గాల్లో పరిష్కరించుకునేందుకు కట్టుబడి ఉన్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. తాజాగా అణు ఒప్పందంపై ఇరాన్ను ట్రంప్ మరోసారి హెచ్చరించారు. దాడులతో సాధించేదేమీ లేదని, ఇప్పటికైనా అమెరికాతో అణు ఒప్పందం కుదుర్చుకోవాలని కోరారు. పరిస్థితి చేయి దాటకముందే చర్చలు జరపాలని స్పష్టం చేశారు.
సోషల్ మీడియా వేదికగా స్పందించిన ట్రంప్..
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడుల తర్వాత ట్రంప్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తమతో ఒప్పందం కుదుర్చుకోవడానికి ఇరాన్కు మంచి అవకాశం ఇస్తూ వచ్చానని పేర్కొన్నారు. అణు ఒప్పందం కుదుర్చుకోవాలని పలుమార్లు సూచించినా అందుకు టెహ్రాన్ అంగీకరించలేదన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని అత్యుత్తమ సైనిక పరికరాలను అమెరికా తయారు చేస్తోందన్నారు. పరికరాల్లో అనేకం ఇజ్రాయెల్ వద్ద ఉన్నాయని తెలిపారు. పరికరాలను ఎలా ఉపయోగించాలో కూడా ఆ దేశానికి తెలుసన్నారు. తర్వాత పరిస్థితి తను ఊహించిన దానికంటే ఉంటుందని ట్రంప్ హెచ్చరించారు.
కొందరు ఇరాన్ నేతలు పట్టించుకోవడం లేదు..
పలుమార్లు చెబుతున్నా కొందరు ఇరాన్ నేతలు తన మాటలు పట్టించుకోకుండా మాట్లాడుతున్నారన్నారు. కానీ, భవిష్యత్లో ఏం జరుగుతుందో వారికి తెలియదని రాసుకొచ్చారు. ఇరాన్లో ఇప్పటికే చాలామంది ప్రాణాలు కోల్పోయారని, భారీ విధ్వంసం జరిగిందని పేర్కొన్నారు. మారణహోమం మరింత దారుణంగా మారటానికి సమయం పడుతుందని పేర్కొన్నారు. పరిస్థితులు చేయి దాటకముందే ఇరాన్ తమతో ఒప్పందం చేసుకోవాలని సూచించారు. తాను చెప్పినట్లు చేస్తే మరణాలు, విధ్వంసాలు ఉండవని స్పష్టం చేశారు.
రణరంగంగా పశ్చిమాసియా..
ఇజ్రాయెల్-ఇరాన్ ఇరుదేశాల మధ్య నెలకొన్న తాజా ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పశ్చిమాసియా మరోసారి రణరంగంగా మారింది. ఇరాన్ న్యూక్లియర్ ప్లాంట్, సైనిక స్థావరాలే లక్ష్యంగా టెల్అవీవ్ వైమానిక దాడులు చేసింది. దాడుల్లో ఇరాన్ పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్ చీఫ్ హొస్సేన్ సలామీ మృతి చెందారు. మిలిటరీ చీఫ్ మహమ్మద్ బాఘేరి మృతిచెందారు. ఇరాన్ అణు లక్ష్యాలను దెబ్బతీసేందుకు ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ను ప్రారంభించామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పేర్కొన్నారు.