Published On:

Fuel Prices: ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం.. పెరిగిన చమురు ధరలు

Fuel Prices: ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం.. పెరిగిన చమురు ధరలు

Iran- Israel War: పశ్చిమాసియా దేశాలైన ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య యుద్ధవాతావరణం నెలకొంది. దీంతో పరిసర దేశాల్లోనూ ఉద్రిక్తత నెలకొంది. ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. ఇరాన్ లోని 100కు పైగా స్థావరాలపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు దాడులు చేశాయి. ముఖ్యంగా అణు స్థావరాలు, ఆర్మీ క్యాంప్ లను ఇజ్రాయెల్ టార్గెట్ చేసింది. దీంతో ఇరాన్ కు భారీ నష్టం వాటిల్లింది. ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ లోని ప్రజలు, పలువురు కీలక నేతలు, అధికారులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇరాన్ కూడా ప్రతీకార దాడులకు సిద్ధమైంది. ఇజ్రాయెల్ మీదకి 100కి పైగా డ్రోన్లను ప్రయోగించింది.

కాగా పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలొచ్చాయి. అంతర్జాతీయ చమురు మార్కెట్ లో ధరలు ఇవాళ 10 శాతానికి పైగా పెరిగాయి. హర్మోజ్ జలసంధి ద్వారా జరిగే గ్లోబల్ ఆయిల్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలగవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఆయిల్ కంపెనీలు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయని మార్కెట్ విశ్లేషకులు తెలిపారు. ఆసియా, యూరప్ లో షేర్లు పడిపోయాయని వెల్లడించారు. రాబోయే రోజుల్లో ఈ యుద్ధం మరింత ఉధృతంగా సాగొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో చమురు ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

హర్మోజ్ జలసంధి ప్రపంచంలోని అతి ముఖ్యమైన షిప్పింగ్ మార్గాల్లో ఒకటి. ప్రపంచంలోని చమురులో ఐదో వంతు చమురు ఈ మార్గంలో రవాణా అవుతుంది. ఉత్తరాన ఇరాన్.. దక్షిణాన ఒమన్, యూఏఈతో సరిహద్దులుగా ఉన్న హర్మోజ్ జలసంధి అరేబియా సముద్రంతో కలుపుతుంది. సౌదీ అరేబియా, యూఏఈ, కూవైట్, ఖతార్, ఇరాక్, ఇరాన్ దేశాల నుంచి వివిధ దేశాలకు రోజుకు 2.1 కోట్ల బ్యారెళ్ల చమురు ఎగుమతి అవుతుంది. ప్రస్తుత వాతావరణంలో యుద్ధం కొనసాగితే ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం.