Published On:

Covid: ఆసియా దేశాల్లో కరోనా భయం.. భారీగా కేసుల నమోదు

Covid: ఆసియా దేశాల్లో కరోనా భయం.. భారీగా కేసుల నమోదు

Virus: ఐదేళ్ల క్రితం ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారిని తలచుకుంటే ఇప్పటికీ ప్రజలకు కాళ్లు, చేతులు వణకుతాయి. ఆ వైరస్ సృష్టించిన నష్టం అంతా ఇంతా కాదు. అలాంటి వైరస్ మళ్లీ వ్యాప్తి చెందుతోంది. అవును మీరు విన్నది నిజమే.. తాజాగా ఆసియాలోని పలు దేశాల్లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. దీంతో ఆయా దేశాల ఆరోగ్యశాఖ అధికారులు అలర్ట్ అయ్యారు.

ఆసియా దేశాలైన హాంకాంగ్, సింగపూర్ లో భారీగా కరోనా కేసులు నమోదవుతున్నట్టు సమాచారం. ముఖ్యంగా హాంకాంగ్ లో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందని స్థానిక అధికారి ఒకరు చెప్పారు. మే3 తో ముగిసిన వారంలో కొత్తగా 31 కోవిడ్ మరణాలు నమోదైనట్టు చెప్పారు. కాగా ప్రస్తుతం నమోదవుతున్న కేసులతో వైరల్ లోడ్ పెరుగుతున్నట్టు అధికారులు చెప్పారు.

 

మరోవైపు సింగపూర్ కూడా కోవిడ్ కేసుల పెరుగుదలతో అప్రమత్తమైంది. దాదాపు ఏడాది తర్వాత ఈనెలలో కోవిడ్ కేసుల సంఖ్య పెరగడంపై సింగపూర్ హెల్త్ డిపార్ట్మెంట్ అలర్ట్ అయింది. అందుకు సంబంధించి ఓ రిపోర్ట్ విడుదల చేసింది. మే 3 చివరి వారం నాటికి దేశంలో కరోనా కేసుల సంఖ్య 14200 కి చేరుకున్నట్టు తెలిపింది. అలాగే ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య దాదాపు 30 శాతం పెరిగినట్టు సమాచారం. నెమ్మదిగా కరోనా వైరస్ థాయ్ లాండ్ , చైనాను కూడా తాకింది. ఆయా దేశాల్లో కూడా పెద్ద సంఖ్యలో కోవిడ్ కేసులు పెరుగుతున్నట్టు తెలుస్తోంది.

 

కాగా ఆసియా దేశాల్లో కరోనా కేసులు నమోదు కావడంతో పలు దేశాలు అప్రమత్తమయ్యాయి. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రజలు రద్దీగా ఉండే ప్రాంతాలకు దూరంగా ఉండాలని, మాస్కులు ధరించి, పరిశుభ్రత పాటించాలని కోరుతున్నారు.