Telugu Film Chamber: జూన్ 1 నుంచి థియేటర్లు బంద్.. స్పందించిన ఫిల్మ్ ఛాంబర్

Telugu Film Chamber Reacts on Theatres Bandh Rumors: జూన్ 1వ తేదీ నుంచి థియేటర్లు బంద్ పాటించనున్నాయంటే కొన్ని రోజులు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. థియేటర్ల బంద్పై తాజాగా ఫిల్మ్ఛాంబర్ కీలక వ్యాఖ్యలు చేసింది. కాగా ప్రస్తుతం ఇండస్ట్రీలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో థియేటర్ యాజమాన్యాలు బంద్ దిశగా నిర్ణయం తీసుకోబోతున్నాయంటూ కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది.
మల్టీప్లెక్స్లకు ఇస్తున్న పర్సంటేజ్ విధానాన్నే సింగిల్ స్క్రీన్ థియేటర్లలోనూ అమలు చేయాలని తెలుగు ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తున్నాయి. తమ డిమాండ్ను నేరవేర్చకపోతే థియేటర్లను బంద్ చేస్తామంటూ వారు హెచ్చరిస్తున్న నేపథ్యంలో నేడు శనివారం (మే 24) తెలుగు సినీ పరిశ్రమ సమావేశమంది. ఈ మేరకు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లుతో తెలుగు సినీ నిర్మాతుల భేటీ అయ్యి పలు కీలక అంశాలపై చర్చించారు. సమావేశం అనంతరం ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి దామోదర ప్రసాద్ మీడియా ముందు మాట్లాడారు.
ఈ మేరకు థియేటర్ల బంద్ అనేది లేదని, ఈ ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని స్పష్టం చేశారు. జూన్ 1 నుంచి థియేటర్ల బంద్ అనేది ఏమి ఉండదన్నారు. చర్చలు జరగకపోతే జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేస్తామని చెప్పారు. కానీ, దాన్ని కొంతమంది మరోలా ప్రచారం చేశారు. జూన్ 1 నుంచి థియేటర్స్ మూసివేస్తారనే ప్రచారం చేస్తున్నారు. కానీ ఇప్పుడు అలాంటిదేమి లేదు. కేవలం ఒక్క సినిమాను దృష్టిలో పెట్టుకుని థియేటర్లు బంద్ చేస్తామనడం సరికాదు. ఇలాంటి వార్తల వల్ల బిజినెస్ను దెబ్బతీస్తాయి.
చిత్ర పరిశ్రమలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. అవన్ని ఒకదానితో ఒకటి కనెక్ట్ అయ్యి ఉన్నాయి. ఒక్కొదాన్ని పరిష్కరించుకుంటూ వెళ్లాలి. సమస్యల పరిష్కారం కొరకు మూడు సెక్టార్ల నుంచి కమిటీ వేస్తున్నాం. ఆ తర్వాత రోడ్ మ్యాప్ ఏంటనేది నిర్ణయిస్తాం. నిర్ణిత సమయంలోగా సమస్యలు పరిష్కరించుకుంటాం. ఇప్పటి వరకు థియేటర్ల పర్సంటేజీ విషయమై ఎలాంటి చర్చ జరగలేదు. ఇలాంటి సమస్య ఎప్పుడూ రాలేదు. కానీ ఇప్పడు వచ్చింది. దీనిపై చర్చ జరుగుతోంది. ఈ నెల 30న జరిగే సమావేశంలో కమిటీ ఎవరనేది నిర్ణయిస్తాం” అని ఆయన పేర్కొన్నారు.