Published On:

Tirumala Rush: తిరుమలలో భక్తుల రద్దీ.. మరో వారంపాటు ఇదే పరిస్థితి

Tirumala Rush: తిరుమలలో భక్తుల రద్దీ.. మరో వారంపాటు ఇదే పరిస్థితి

Devotees: వేసవి సెలవులు ముగియనుండటం, శుభకార్యాలు, పెళ్లిళ్లు జరుగుతుండటంతో తిరుమలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో శ్రీవారి భక్తులతో తిరుమల కొండ కిక్కిరిసిపోయింది. ఇవాళ ఉదయం సమయానికి స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. వెలుపల శిలాతోరణం వరకు భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. దీంతో స్వామివారి దర్శనానికి 24 గంటల సమయం వరకు పడుతోంది. దీంతో క్యూలైన్లలో ఉన్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ తగిన ఏర్పాట్లు చేస్తోంది. శ్రీవారి సేవకుల ద్వారా భక్తులకు తాగునీరు, పాలు, అన్నప్రసాదం, మజ్జిగ వంటివి పంపిణీ చేస్తోంది.

 

కాగా నిన్న స్వామివారిని 88,257 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిల 45,068 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.68 కోట్లు వచ్చినట్టు టీటీడీ ప్రకటించింది. కాగా వచ్చే వారం, పది రోజుల పాటు తిరుమలలో భక్తుల రద్దీ ఇదే విధంగా కొనసాగవచ్చని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో భక్తుల సౌకర్యార్థం తగిన ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు కాలినడకన వచ్చే భక్తుల కోసం అలిపిరి భూదేవీ కాంప్లెక్స్ లో దివ్యదర్శనం టోకెన్లను టీటీడీ జారీ చేస్తోంది.