Tirumala Darshan: తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి 18 గంటలు!

18 Hours time for Tirumala Darshan: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. ఓవైపు స్కూళ్లు, కాలేజీలు తెరచుకున్నా, మరోవైపు వర్షాలు పడటంతో. వ్యవసాయ పనులు ప్రారంభమైనా తిరుమలకు భక్తులు ఇంకా భారీగా తరలివస్తున్నారు. దీంతో తిరుమలలో భక్తుల రద్దీ ఇంకా ఉంది. ఈనేపథ్యంలో స్వామివారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. అలాగే తిరుమలకు వచ్చే భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. వెలుపల ఏటీజీహెచ్ వరకు భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. కాగా నిన్న శ్రీవారిని 84,681 మంది భక్తులు దర్శించుకున్నారు. మరోవైపు నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.43 కోట్లు వచ్చినట్టు టీటీడీ ప్రకటించింది.
మరోవైపు ఈనెల 23న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం టోకెన్లను టీటీడీ విడుదల చేయనుంది. అలాగే అదే రోజు వృద్ధులు, దివ్యాంగుల దర్శన టికెట్లను విడుదల చేయనున్నట్టు టీటీడీ తెలిపింది. ఈనెల 24న రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, మధ్యాహ్నం వసతి గదుల టోకెన్లను విడుదల చేయనుంది. అలాగే ఈనెల 25న మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి సేవా టికెట్లు విడుదల చేయనున్నట్టు టీటీడీ ప్రకటించింది.