Tirumala: నేడు ఏరువాక పౌర్ణమి.. శ్రీవారి ఆలయంలో ముగియనున్న జ్యేష్టాభిషేకం
Jyestabhishekam: తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామికి నిర్వహిస్తున్న సాలకట్ల జ్యేష్టాభిషేక మహోత్సవాలు నేటితో ముగియనున్నాయి. ప్రతి ఏటా జ్యేష్ట నక్షత్రం రోజున ఉత్సవాలు ముగిసేలా తిరుమల శ్రీవారి ఆలయంలో మూడు రోజులపాటు జ్యేష్టాభిషేకాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా స్వామివారికి ఉన్న బంగారు కవచాలను తొలగించి పాలు, పెరుగు, తేనె, పంచదార, కొబ్బరినీళ్లు, పసుపు, చందనం వంటి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహిస్తారు. నైవేద్య తాంబూలాలు సమర్పింస్తారు. అలాగే ఉత్సవాల్లో మొదటిరోజు వజ్ర కవచం తొడిగి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు. అలాగే రెండో రోజు ముత్యాల అంగి తొడుగులో నిన్న స్వామివారు భక్తులకు కనువిందు చేశారు. ఇక ఇవాళ ఆఖరిరోజు తిరిగి బంగారు కవచం సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలో తిరుమల ఆలయంలో పలు ఆర్జిత సేవలను టీటీడీ అధికారులు రద్దు చేశారు.
మరోవైపు నేడు జ్యేష్ట పూర్ణిమ, ఏరువాక పూర్ణిమ, బుద్ధ పూర్ణిమగా పిలుచుకుంటారు. అన్నదాతలు నేడు తమ ఇంట్లోని పశువులను అందంగా అలంకరించి.. పూజలు నిర్వహించి వ్యవసాయ పనులను ప్రారంభిస్తారు. మరోవైపు శ్రీవారి ఆలయంలోనూ గోవులకు పూజలు నిర్వహించనున్నారు.
ఇక తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. వేసవి సెలవుల అనంతరం రేపటి నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతున్నా తిరుమలలో భక్తుల రద్దీ ఇంకా ఉంది. దీంతో స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. నిన్న స్వామివారిని 80,894 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 32,508 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.30 కోట్లు వచ్చినట్టు టీటీడీ ప్రకటించింది.