Atchannaidu @Tirupati: వ్యాపారులకంటే ఎక్కువ ఇస్తాం: అచ్చెన్నాయుడు!
Atchannaidu at Tirupati: తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం దామలచెరువులో మామిడి రైతుల సమస్యలపై సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే పులివర్తి నాని అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలోని ముఖ్య అతిథిగా మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. మామిడి రైతుల సమస్యలను ఎమ్మెల్యే పులివర్తి నాని ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
సీఎం చంద్రబాబు మామిడి రైతుల సమస్యలపై సానుకూలంగా స్పందించి, వ్యాపారులు ఇచ్చేదానికంటే అదనంగా.. ప్రభుత్వం తరఫున రైతులకు కేజీకి రూ.4 చెల్లించేలా చర్యలు తీసుకున్నారని మంత్రి తెలిపారు. జిల్లాలో 44 పరిశ్రమలు ఉండగా, ఇప్పటివరకు 22 మెట్రిక్ టన్నుల మామిడిని ఈ ఫ్యాక్టరీలు కొనుగోలు చేశాయని తెలిపారు. ప్రాసెసింగ్ యూనిట్లు, మండీలు రైతులను ఇబ్బంది పెడితే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రాసెసింగ్ యూనిట్ల యజమానులతో మాట్లాడి మామిడి రైతులకు మంచి ధర లభించేలా ప్రయత్నిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. రైతులు ప్రకృతి వ్యవసాయంపై ఆసక్తి చూపాలని, తద్వారా మంచి ఆహారంతో పాటు మంచి ధర కూడా లభిస్తుందని సూచించారు.