Mock Drill: పాక్ సరిహద్దులో నేడు మాక్ డ్రిల్.. కేంద్రం కీలక ఆదేశాలు

India: కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో పాకిస్తాన్ సరిహద్దు వెంబడి భారత ఆర్మీ నేడు మాక్ డ్రిల్ నిర్వహించనుంది. దీంతో పాక్ సరిహద్దు రాష్ట్రాల్లో హైఅలర్ట్ ప్రకటించింది. మరోవైపు పాకిస్తాన్ లోనూ భయానక వాతావరణం నెలకొంది. భారత్ నిర్వహిస్తున్న మాక్ డ్రిల్ తో పాకిస్తాన్ అప్రమత్తమైంది. తమ దేశంపై భారత్ ఏదో చేయబోతోందని పాకిస్తాన్ అసత్యాలు ప్రచారం చేస్తోంది. కాగా ఆపరేషన్ షీల్డ్ పేరుతో పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రాల్లో ఇవాళ రాత్రి 8 గంటలకు బ్లాక్ అవుట్ తో పాటు మాక్ డ్రిల్ ఉంటుంది.
ఈ సందర్భంగా రాత్రి 8 గంటలకు కరెంట్ సరఫరా నిలిపివేసి సైరన్ మోగిస్తారు. బ్లాక్ అవుట్ 15 నిమిషాలపాటు కొనసాగనుంది. ఆపరేషన్ షీల్డ్ మాక్ డ్రిల్ ను ముఖ్యంగా జమ్ముకాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ తో పాటు హర్యానాలోనూ నిర్వహించనున్నారు. జమ్ము కాశ్మీర్ లోని కాశ్మీర్, జమ్మూ డివిజన్ జిల్లాల్లో దీని కోసం సన్నాహాలు జరిగాయి. మాక్ డ్రిల్స్ నిర్వహించబడే సరిహద్దు ప్రాంతంలో షెల్లింగ్ జరిగినప్పుడు ప్రజలను సురిక్షిత ప్రదేశాలకు, వైద్య సహాయం ఎలా అందించాలో ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. సైరన్ మోగిన వెంటనే ప్రజలు తమ ఇళ్లలోని లైట్లను, విద్యుత్ పరికరాలను బంద్ చేయాలని అధికారులు చెప్పారు.
మాక్ డ్రిల్ సమయంలో ఆస్పత్రులు సహా అన్ని అత్యవసర సేవలు పూర్తిగా పనిచేస్తాయని జమ్ముకాశ్మీర్ అధికార యంత్రాంగం స్పష్టం చేసింది. ముందుగా మే29న మాక్ డ్రిల్ జరగాల్సి ఉంది కానీ వాయిదా పడింది. హర్యానాలో మాక్ డ్రిల్ కోసం సన్నాహాలు చేస్తున్నారు. ఆపరేషన్ షీల్డ్ కింద రాష్ట్రవ్యాప్తంగా వైమానిక దాడులు, డ్రోన్ దాడులను ఎదుర్కోవడానికి సంసిద్ధతను పరీక్షించనున్నారు. అన్ని జిల్లాల్లో సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పౌర రక్షణ విన్యాసాలు నిర్వహిస్తారు. అత్యవసర పరిస్థితుల్లో సాయం చేసేందుకు వివిధ సేవ సంస్థలు, భారత్ సౌట్స్ అండ్ గైడ్స్ వంటి యువజన సంస్థల నుంచి 32 వేల మంది వాలంటీర్లను సిద్ధం చేశారు.