Published On:

IND Vs SA: ఫైనల్ కు దూసుకెళ్లిన భారత్.. ట్రై సిరీస్ లో సౌతాఫ్రికాపై విక్టరీ

IND Vs SA: ఫైనల్ కు దూసుకెళ్లిన భారత్.. ట్రై సిరీస్ లో సౌతాఫ్రికాపై విక్టరీ

Cricket: శ్రీలంక వేదికగా భారత్, శ్రీలంక, సౌతాఫ్రికా మహిళల జట్ల మధ్య జరుగుతున్న ట్రై సిరీస్ లో ఇండియన్ విమెన్ టీమ్ అదరగొడుతోంది. ప్రేమదాస స్టేడియం వేదికగా నేడు సౌతాఫ్రికాతో జరిగిన వన్డేలో భారత మహిళల జట్టు సఫారీ జట్టుపై 23 పరుగుల తేడాతో గెలిచింది. ట్రై సిరీస్ లో మూడో విజయాన్ని నమోదు చేసుకుని ఫైనల్ కు దూసుకెళ్లింది.

 

కాగా ముందుగా టాస్ గెలిచిన సౌతాఫ్రికా మహిళల జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు నిర్ణీత 50 ఓవర్లు ముగిసే సమయానికి 9 వికెట్లు కోల్పోయి 337 పరుగుల భారీ స్కోర్ చేసింది. జెమీమా రోడ్రిగ్స్ సెంచరీతో రాణించింది. ఆమె 101 బంతుల్లోనే 123 పరుగులు చేసింది. కాగా స్మృతి మందాన హాఫ్ సెంటరీతో రాణించగా.. దీప్తి శర్మ (93) కొద్దిలో శతకాన్ని చేజార్చుకుంది. సౌతాఫ్రికా బౌలర్లలో మసబాట క్లాస్, నదీన్ డి క్లర్క్, నోన్కులులేకో ఎంలబాకు తలా రెండు వికెట్లు దక్కాయి.

 

ఇక 338 పరుగుల భారీ టార్గెట్ ఛేదనలో బ్యాటింగ్ కు వచ్చిన సౌతాఫ్రికా మహిళల జట్టు 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి కేవలం 314 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే భారత మహిళ బౌలర్లు అద్భుతంగా రాణించి సౌతాఫ్రికా టార్గెట్ ను ఛేదించకుండా కట్టడి చేశారు. బ్రిట్స్, స్మిత్ 63 పరుగులతో మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరూ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన అన్నేరి డెర్క్సెన్, నోండుమిసో షాంగాసే స్కోర్ బోర్డును ముందుకు నడిపించారు. షాంగాసే ఔటైన తర్వాత సఫారీ జట్టు స్కోర్ బోర్డు మందగించింది. కానీ చివర్లో బ్యాటింగ్ కు వచ్చిన కెప్టెన్ చార్లీ ట్రయాన్ భారత బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టింది. కానీ చేయాల్సిన టార్గెట్ ఎక్కువగా ఉండటంతో చివరకు 23 పరుగులతో ఓటమి చవిచూసింది. భారత మహిళా బౌలర్లలో అమంజోత్ కౌర్ కు 3 వికెట్లు దక్కగా, దీప్తి శర్మ 2, ప్రతికా రావల్ ఒక వికెట్ తీసుకున్నారు. జెమిమా రోడ్రిగ్స్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.