Published On:

Revanth Reddy Delhi Tour: నేడు ఢిల్లీకి సీఎం రేవంత్.. నీతి ఆయోగ్ మీటింగ్ కు హాజరు!

Revanth Reddy Delhi Tour: నేడు ఢిల్లీకి సీఎం రేవంత్.. నీతి ఆయోగ్ మీటింగ్ కు హాజరు!

Telangana CM Revanth Reddy Delhi Tour: సీఎం రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో రేపు జరగనున్న నీతి ఆయోగ్ సమావేశానికి హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ రాత్రి 8 గంటలకు ఢిల్లీకి బయల్దేరనున్నారు. కాగా గతంలో జరిగిన నీతి ఆయోగ్ మీటింగ్ కు పలు కారణాలతో సీఎం రేవంత్ రెడ్డి హాజరుకాలేదు. కాగా రేపు జరిగే సమావేశానికి సీఎం హోదాలో తొలిసారిగా పాల్గొననున్నారు.

 

సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రానికి రావల్సిన నిధుల గురించి మాట్లాడనున్నారు. తెలంగాణ రైజింగ్ కోసం నీతి ఆయోగ్ లో నిధుల కోసం విజ్ఞప్తి చేయనున్నారు. అలాగే తెలంగాణలో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు నిధులు కావాలని ఇప్పటికే పలుమార్లు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డి లేఖలు రాశారు. కాగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న మెట్రో రైలు విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం, ఫోర్త్ సిటీ, మూసీ పునరుజ్జీవం వంటి పనులకు నిధులు కేటాయించాలని కోరారు.

 

నీతి ఆయోగ్ మీటింగ్ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి పలువురు కేంద్రమంత్రులను కలవనున్నట్టు సమాచారం. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులకు నిధులు, పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు నిధులు, ఆర్థికసాయంపై కేంద్ర ప్రభుత్వ పెద్దలను కోరనున్నట్టు తెలుస్తోంది. అనంతరం కాంగ్రెస్ అగ్రనేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నట్టు తెలుస్తోంది. సమావేశంలో పార్టీకి సంబంధించిన విషయాలపై చర్చ జరగనున్నట్టు టాక్. అయితే మంత్రివర్గ విస్తరణపై ఎమైనా సమాలోచనలు జరుగుతాయా అనే విషయంపై క్లారిటీ లేదు.