Published On:

J&K Encounter: జమ్ముకాశ్మీర్ కొనసాగుతున్న ఎన్ కౌంటర్.. భారీగా ఆయుధాలు స్వాధీనం!

J&K Encounter: జమ్ముకాశ్మీర్ కొనసాగుతున్న ఎన్ కౌంటర్.. భారీగా ఆయుధాలు స్వాధీనం!

Encounter is Continue in Jammu and Kashmir: జమ్ముకాశ్మీర్ లో పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఉద్రిక్తతలు మరింత పెరిగిపోయాయి. లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన ముష్కరులు 26 మంది పర్యాటకులను కాల్చి చంపారు. దాడి తర్వాత ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ ను మరింత ముమ్మరం చేశాయి. అందులో భాగంగానే పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై ఆపరేషన్ సిందూర్ పేరుతో దాడులు చేసింది. అనుమాతులను అదుపులోకి తీసుకున్నాయి. ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నాయి. ఇప్పటికే తనిఖీల్లో పలువురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. మరోవైపు పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కిష్ట్వార్ జిల్లాలో ఎదురుకాల్పులు జరుగుతున్నాయి.

 

జమ్ముకాశ్మీర్ లోని కిష్ట్వార్ జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. రెండోరోజు కూడా ఉగ్రవాదులతో ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఛాత్రూ ప్రాంతంలోని సింగ్ పొరాలో పెద్ద ఎత్తున ఎన్ కౌంటర్ జరుగుతోంది. ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భద్రతాబలగాలు, జమ్ముకాశ్మీర్ పోలీసులు కలిసి సెర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టారు. దీంతో ఉగ్రవాదులు కాల్పులు జరపగా.. భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. మరోవైపు కాల్పుల్లో జవాన్ సందీప్ పాండురంగ్ వీరమరణం పొందారు.

 

కాగా సింగ్ పొరాలో ఇంకా కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. మిగిలిన ఉగ్రవాదులు అటవీ ప్రాంతంలో దాక్కున్నట్టు నిఘా వర్గాలు తెలుపుతున్నాయి. ఉగ్రవాదులు దాగి ఉన్న స్థావరాలను గుర్తించేందుకు ఆధునిక టెక్నాలజీ, డ్రోన్ లు, థర్మల్ ఇమేజింగ్ వంటి టెక్నాలజీని ఉపయోగిస్తున్నాయి. మరోవైపు ఉగ్రవాదులు కూడా ఎన్ క్రిప్టెడ్ సమాచార పరికరాలను వినియోగిస్తున్నట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. దీంతో సెర్చ్ ఆపరేషన్ ను విజయవంతంగా నిర్వహించేందుకు బలగాలు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నాయి. మరోవైపు ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతంలో భద్రతా బలగాలు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. మరో ఇద్దరు, ముగ్గురు ఉగ్రవాదులు ఉన్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు.