Published On:

NITI Aayog Meeting: నీతి ఆయోగ్ మీటింగ్ ప్రారంభం.. పలు రాష్ట్రాల సీఎంలు హాజరు

NITI Aayog Meeting: నీతి ఆయోగ్ మీటింగ్ ప్రారంభం.. పలు రాష్ట్రాల సీఎంలు హాజరు

NITI Aayog Meeting in New Delhi: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నేడు ఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభమైంది. ప్రగతి మైదాన్ లోని భారత్ మండపంలో జరుగుతున్న సమావేశానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు హజరైనట్టు సమాచారం. ‘వికసిత్ రాజ్య, వికసిత్ భారత్- 2047’ థీమ్ గా నేడు నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం జరుగుతోంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి సమావేశం జరుగుతుండడంతో ఎలాంటి అంశాలపై చర్చ జరగనుందనే విషయంపై ఆసక్తి నెలకొంది. సమావేశానికి రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు హాజరయ్యారు.

 

నీతి ఆయోగ్ చైర్మన్ గా ప్రధాని మోదీ అధ్యక్షత వహిస్తున్నారు. సమావేశంలో అన్ని రాష్ట్రాల సీఎంలు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, నీతి ఆయోగ్ ఉపాధ్యక్షులు, మండలి శాశ్వత సభ్యులు, ప్రత్యేక అతిథులు హాజరయ్యారు. కాగా 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ ను ఆవిష్కరించడమే లక్ష్యంగా సమావేశం ప్రారంభమైంది.

 

మరోవైపు భారత్ కు స్వాతంత్ర్యం వచ్చి 2047 నాటికి 100 ఏళ్లు పూర్తయ్యేనాటికి దేశాన్ని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపేలా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. అందులో భాగంగానే అన్ని రాష్ట్రాలను కలుపుకుని పనిచేస్తోంది. జాతీయ స్థాయి లక్ష్యానికి, రాష్ట్రాల లక్ష్యాలను కూడా జోడించడం, సహకార సమాఖ్య వాదాన్ని మరింతగా బలపరుచుకోవడమే సమావేశం ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తోంది. సమావేశంలో పాల్గొనేందుకు తెలుగు రాష్ట్రాల సీఎం రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఢిల్లీకి చేరుకున్నారు. అలాగే రాష్ట్రానికి రావల్సిన నిధులు, అభివృద్ధి పనులకు ఆర్థిక సాయంపై పలువురు కేంద్రమంత్రులతో సమావేశమయ్యారు. అలాగే నీతి ఆయోగ్ సమావేశంలో రాష్ట్రాలకు కావల్సిన నిధులు, సమస్యలపై చర్చించనున్నారు.