PM Modi: ‘సిందూరం అంటే నారీ శక్తి జాతీయ వీరత్వం’.. ప్రధాని మోదీ

Bhopal: సిందూరం అంటే మహిళలకు అలంకారం.. కానీ ఇప్పుడు అది నారీ శక్తి జాతీయ వీరత్వానికి గుర్తుగా మారిందని ప్రధాని మోదీ అన్నారు. మధ్యప్రదేశ్ లో పర్యటిస్తున్న ఆయన భోపాల్ లో ఇవాళ నిర్వహించిన మహిళా శక్తీకరణ మహా సమ్మేళనంలో పాల్గొన్నారు. ఆపరేషన్ సిందూర్ ను ఉదహరిస్తూ ఇది భారతీయ మహిళల ధైర్యం, శక్తి, సంకల్పాన్ని ప్రతిబింబిస్తుందని చెప్పారు. శ్రీరాముడిని ఆరాధించడానికి హనుమంతుడు కూడా సింధూరం ఉపయోగించాడని ప్రధాని ప్రస్తావించారు. దేవి అహల్యాబాయి హోల్కర్ 300వ జన్మదినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.
దేవి అహల్యాబాయి దేవుని ఆరాధనకు, ప్రజల సేవకు ఎలాంటి భేదం చూపలేదన్నారు. ఆమె పేదల జీవితాల్లో పురోగతి కోసం అవిశ్రాంతంగా కృషి చేశారని చెప్పారు. కాశీలో సేవ చేసే అవకాశం నాకు లభించడం సంతోషకరమన్నారు. అక్కడే అహల్యాబాయి అభివృద్ధి పనులకు మొదట పునాది వేశారని మోదీ గుర్తు చేసుకున్నారు. ఆమె మహిళలను చేనేత రంగంలో శక్తివంతం చేశారని, నీటి సంరక్షణతో రైతులు ఎక్కువ ఆదాయం పొందేలా సహాయపడ్డారని వెల్లడించారు. స్త్రీలకు కూడా ఆస్తి హక్కులు ఉండాలని, మహిళలకు వితంతు వివాహాలను ప్రోత్సహించారని ప్రధాని అన్నారు.
ప్రస్తుత ప్రభుత్వం నీటి సరఫరా, గ్యాస్ కనెక్షన్, విద్యుత్ సరఫరా, వైద్య సంక్షేమ పథకాల ద్వారా సమాజ పురోగతి కోసం కృషి చేస్తోందని మోదీ తెలిపారు. గతంలో మహిళలు తమ అనారోగ్యాలను దాచుకునేవారని.. తమ కుటుంబంపై భారం కాకూడదని భావించేవారని వెల్లడించారు. కానీ ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ యోజన ద్వారా ఐదు లక్షల రూపాయల వరకు వైద్య సాయం పొందుతున్నారని ప్రధాని చెప్పారు. మూడు కోట్ల మహిళలను లక్షాధికారులను చేస్తామని తాము వాగ్దానమిచ్చామని గుర్తుచేశారు. అందులో భాగంగానే వేలాది మంది మహిళలు స్వయం సహాయక బృందాలతో అనుసంధానమై ఉన్నారని తెలిపారు.