Operation Sindoor : ఐక్యత, భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ జాతీయ భాష : ఎంపీ కనిమొళి

All-party MPs group visits Spain : ఆపరేషన్ సిందూర్, ఉగ్రవాదంపై భారత్ పోరును వివరించేందుకు విదేశాల్లో అఖిలపక్ష ఎంపీల బృందాలు పర్యటనలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా డీఎంకే ఎంపీ కనిమొళి సారథ్యంలోని ప్రతినిధుల బృందం స్పెయిన్లో పర్యటిస్తోంది. భారత్ అధికార భాషపై మాడ్రిడ్లో ఎన్అర్ఐలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భారత్లో అధికార భాషపై అడిగిన ఓ ప్రశ్నకు ఎంపీ కనిమొళి సమాధానం ఇచ్చారు. ఐక్యత, భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ జాతీయ భాష అని చెప్పుకొచ్చారు. ఈ సందేశాన్ని ప్రపంచానికి చాటిచెప్పేందుకు తమ ప్రతినిధుల బృందం ఇక్కడికి వచ్చిందని తెలిపారు. ఐక్యత, భిన్నత్వంలో ఏకత్వం చాలా ప్రాధాన్యతతో కూడుకున్న అంశమన్నారు. దీంతో కనిమొళి చెబుతున్నప్పుడు హర్షధ్వానాలు వ్యక్తమయ్యాయి. భిన్నత్వంలో ఏకత్వం అనేది రాజ్యాంగంలో పొందుపరిచారని, ఏ ఒక్క భాషను జాతీయ భాషగా ప్రకటించ లేదన్నారు. రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ కింద అధికారిక భాషలుగా 22ని గుర్తించారని పేర్కొన్నారు.
ఉగ్రవాదంపై మాట్లాడారు. ఉగ్రవాదంపై పోరుకు కట్టుబడి ఉన్నామన్నారు. ఆ పని చేస్తున్నామని, ఇంకా చేయాల్సి ఉందని చెప్పారు. భారత్ సురక్షిత దేశమని, కశ్మీర్ సురక్షితంగా ఉండేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇందుకు భిన్నంగా ఎవరు ఏమి చేయాలనుకున్న ఇక నుంచి వారి ఆటలు సాగనీయబోమన్నారు. ఎంపీ కనిమొళి ప్రతినిధుల బృందంలో సమాజ్వాదీ పార్టీ ఎంపీ రాజీవ్ కుమార్ రాయ్, బీజేపీ ఎంపీ బ్రిజేష్ చౌతా, ఆప్ ఎంపీ అశోక్ మిట్టల్, ఆర్జేడీ ఎంపీ ప్రేమ్ చంద్ గుప్తా, మాజీ దౌత్యవేత్త మంజీవ్ సింగ్ పురి ఉన్నారు.