S.Jaishankar : దుష్టులు బాధితులతో సమానం కాదు.. పాకిస్థాన్పై జైశంకర్ ధ్వజం
Indian Foreign Minister S.Jaishankar fires on Pakistan : భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ పాక్పై విరుచుకుపడ్డారు. దుష్టులు బాధితులతో సమానం కాదన్నారు. ఇండియా ఉగ్రవాదాన్ని ఎన్నటికీ సహించబోదన్నారు. బ్రిటన్ విదేశాంగశాఖ మంత్రి డేవిడ్ లామీతో జైశంకర్ ఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యలు చేశారు.
పహల్గామ్ ఉగ్రదాడిని బ్రిటన్ ప్రభుత్వం తీవ్రగా ఖండించింది. ఈ సందర్భంగా బ్రిటన్ ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఉగ్రవాదాన్ని తాము ఎన్నటికీ సహించబోమని స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని సహించకూడదనే విధానాన్ని ఇండియా అనుసరిస్తోందన్నారు. చెడుకు పాల్పడే వారిని, దానివల్ల బాధితులయ్యే వారిని సమానంగా చూస్తామంటే తాము అంగీకరించబోమని తేల్చిచెప్పారు. ఇది తమ భాగస్వామ్య దేశాలు అర్థం చేసుకోవాలని ఆశిస్తున్నామన్నారు. భేటీ సందర్భంగా రెండుదేశాల ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యపరమైన చర్చలు జరిపినట్లు జాతీయ మీడియా పేర్కొంది.
పహల్గామ్లో ఉగ్రవాదులు జరిపిన దాడిని ప్రపంచ దేశాలు ఖండించాయి. దీంతో భారత్కు మద్దతు కూడా ప్రకటించాయి. ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తూ బాధిత కుటుంబాలకు సంఘీభావం తెలిపాయి. ఘటన తర్వాత భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్పై దాడులు చేసింది. కాల్పుల విరమణ అనంతరం పాక్ ప్రాయోజిత తీవ్రవాదం, ఆపరేషన్ సిందూర్పై వివిధ దేశాలకు వివరించడానికి అఖిలపక్ష బృందాలు ఆయా దేశాలకు వెళ్లాయి.